సన్‌ రైజర్స్‌‌ హైదరాబాద్ కెప్టెన్ మార్పు, ఎవరు?

శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (13:48 IST)
ఐపీఎల్‌‌ 13వ సీజన్‌‌ ప్రారంభానికి ముందు సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌ తమ టీమ్‌‌ కెప్టెన్‌‌ను మార్చింది. 2016 సీజన్‌‌లో తమను చాంపియన్‌‌గా నిలబెట్టిన ఆస్ట్రేలియా డాషింగ్‌‌ ఓపెనర్‌ డేవిడ్‌‌ వార్నర్‌‌కు మరోసారి కెప్టెన్సీ బాధ్యత అప్పగించింది. బాల్‌‌ టాంపరింగ్‌‌ వివాదం వల్ల 2018లో వార్నర్‌ సన్‌‌రైజర్స్‌‌ కెప్టెన్సీని వదలుకున్నాడు. దీంతో ఆ సీజన్‌‌లో జట్టును నడిపించిన న్యూజిలాండ్‌‌ కెప్టెన్‌‌ కేన్‌‌ విలియమ్సన్‌‌ సన్‌‌రైజర్స్‌‌ను రన్నరప్‌‌గా నిలబెట్టాడు. 
 
టీమిండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ కూడా గత రెండు సీజన్లలో కొన్ని మ్యాచ్‌‌ల్లో జట్టును నడిపించాడు. 2020 సీజన్‌‌కు రైజర్స్‌‌ కెప్టెన్‌‌గా తనను నియమించడంపై వార్నర్‌ సంతోషం వ్యక్తం చేశాడు. కేన్‌‌, భువీ గత రెండేళ్లలో జట్టును ఉన్నతస్థాయికి తీసుకెళ్లారని, కొత్త సీజన్‌‌లోనూ వారి సహకారం కోరుకుంటున్నానని వార్నర్‌ తెలిపాడు. 
 
బాల్‌‌ టాంపరింగ్‌‌ నిషేధం ముగిసిన తర్వాత రీఎంట్రీ ఇచ్చిన వార్నర్‌ 2019 సీజన్‌‌లో అద్భుతంగా పెర్ఫామ్‌‌ చేశాడు. 12 మ్యాచ్‌‌ల్లో 692 రన్స్‌‌ చేసి లీగ్‌‌ టాప్‌‌ స్కోరర్‌‌గా నిలిచాడు. వచ్చే ఏప్రిల్‌‌ 1న హైదరాబాద్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌‌తో జరిగే మ్యాచ్‌‌తో సన్‌‌రైజర్స్‌‌ కొత్త సీజన్‌‌ను మొదలుపెట్టనుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు