ఐపీఎల్ 2022: రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయం...

శనివారం, 23 ఏప్రియల్ 2022 (11:31 IST)
ఐపీఎల్ 2022లో శుక్రవారం రాత్రి వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది.
 
చివరి ఓవర్లో 'నో బాల్' లొల్లితో మ్యాచ్ కాసేపు ఆగగా.. రాజస్థాన్ విజయాన్ని మాత్రం ఢిల్లీ అడ్డుకోలేకపోయింది. 223 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 207 పరుగులు మాత్రమే చేసి.. 15 పరుగుల తేడాతో ఓడిపోయింది. 
 
రిషబ్ పంత్ (44), రోవ్‌మెన్ పావెల్ (36), లలిత్ యాదవ్ (37) ధాటిగా ఆడారు. రాజస్థాన్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3, అశ్విన్ 2 వికెట్లు పడగొట్టారు.
 
ఆఖరి రెండు ఓవర్లలో ఢిల్లీ విజయానికి 36 పరుగులు కావాల్సిన తరుణంలో 19వ ఓవర్‌ను ప్రసిధ్ కృష్ణ మెయిడిన్‌ వేసి ఒక వికెట్ తీశాడు. చివరి ఓవర్‌లో మొదటి మూడు బంతులకు 3 సిక్స్‌లు కొట్టిన రోవ్‌మన్‌ పావెల్ (36) ఢిల్లీని గెలిపించినంత పని చేశాడు. 
 
అయితే మూడో బంతిని మెక్‌కాయ్ ఫుల్‌టాస్ వేశాడు. అది నోబాల్ అని ఢిల్లీ వాదించింది. కెప్టెన్ పంత్, కోచింగ్ సిబ్బంది గందరగోళానికి తెరతీశారు. ఆటగాళ్లను ఆడకుండా వచ్చేయాలని పంత్ సైగలు చేశాడు. అయితే అంపైర్లు అది నోబాల్ కాదని స్పష్టం చేశారు. 
 
మెక్‌కాయ్‌ మిగతా మూడు బంతుల్లో కేవలం రెండు పరుగులే ఇచ్చి పావెల్‌ను ఔట్ చేయడంతో రాజస్థాన్‌ విజయం సాధించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు