ప్రైమ్ డే సేల్‌ను ప్రకటించిన అమెజాన్.. 12వ తేదీ అర్థరాత్రి నుంచి...

ఠాగూర్

మంగళవారం, 8 జులై 2025 (15:03 IST)
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అతిపెద్ద వార్షిక సేల్‌ను ప్రకటించింది. ప్రైమ్ డే సేల్2025 పేరుతో ఈ సేల్‌ నిర్వహించనుంది. షాపింగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సేల్ వచ్చే వారం ప్రారంభంకానుంది. మూడు రోజుల పాటు సాగే ఈ సేల్‌లో గ్యాడ్జెట్లు, గృహోపకరణాలు, ఫ్యాషన్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు, ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటించింది. 
 
ప్రధానంగా అమెజాన్ ప్రైమ్ సభ్యుల కోసం ఉద్దేశించిన ఈ సేల్‌లో సాధారణ కస్టమర్లకు కూడా పరిమిత సంఖ్యలో కూడిన ప్రయోజనాలను కల్పించనున్నారు. ఈ వార్షిక సేల్ ప్రకారం... ప్రైమ్ డే సేల్ 2025 జూలై 12వ తేదీ అర్థరాత్రి నుంచి ప్రారంభమై, జూలై 14వ తేదీ వరకు కొనసాగుతుంది. 
 
ఈ మూడు రోజులూ ప్రైమ్ సభ్యులు ప్రత్యేకమైన డీల్స్, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలు, పరిమిత కాల ఆఫర్లను పొందే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్స్ నుంచి దుస్తుల వరకు అన్ని కేటగిరీలలోనూ ఆకర్షణీయమైన తగ్గింపులు ఉంటాయని కంపెనీ తెలిపింది. తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయమని నిపుణులు సూచిస్తున్నారు.
 
ఈ సేల్‌లో భాగంగా అమెజాన్ ప్రముఖ బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డులు, ఎస్బీఐ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోళ్లు జరిపే వారికి 10 శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ ఈఎంఐ లావాదేవీలకు కూడా వర్తిస్తుందని అమెజాన్ స్పష్టం చేసింది. 
 
ఈ బ్యాంకు కార్డులు ఉన్న వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అమెజాన్ పే వినియోగదారులను ఆకర్షించేందుకు కంపెనీ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. అమెజాన్ పే యూపీఐ ద్వారా రెండోసారి కొనుగోలు చేసేవారికి, కనీసం రూ.1,000 లావాదేవీపై రూ.100 ఫ్లాట్ క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నారు. అలాగే, అమెజాన్ పే లేటర్ ద్వారా అర్హులైన వినియోగదారులకు రూ.60,000 వరకు తక్షణ క్రెడిట్‌తో పాటు, రూ.600 విలువైన వెల్‌కమ్ రివార్డులు కూడా లభిస్తాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు