రిలయన్స్ జియో వినియోగదారులను ఆకట్టుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే ఉచిత వాయిస్, డేటా కాల్స్తో టెలికాం రంగంలో జియో సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. తాజాగా 4జీ వోల్ట్(వాయిస్ ఓవర్ లాంగ్ టర్మ్ ఎవల్యూషన్) సదుపాయం ఉన్న ఫీచర్ఫోన్లను అత్యంత తక్కువ ధరకే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో రూ.999 నుంచి రూ.1500 మధ్యలో రెండు 4జీ వోల్ట్ ఫోన్లను రిలయన్స్ తయారు చేసేందుకు కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. జాతీయ మీడియా ప్రకారం ముందు, వెనుక కెమెరాలతో ఈ రెండు ఫీచర్ఫోన్లను రిలయన్స్ మార్కెట్లోకి తీసుకురానుందని తెలిసిందే. అంతేకాకుండా ఆ ఫీచర్ఫోన్లలో రిలయన్స్ జియో చాట్, లైవ్ టీవీ, జియో మనీ యాప్స్ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ప్రస్తుతం 4జీ వోల్ట్ సదుపాయం ఉన్న స్మార్ట్ఫోన్ల ప్రారంభ ధర రూ.3500-4000 మధ్య ఉంటుంది. రిలయన్స్ జియో హ్యాపీ న్యూఇయర్ ఆఫర్ కింద ఉచిత వాయిస్, డేటా సర్వీసులను మార్చి 31 వరకు పొడిగించింది. మరి రిలయన్స్ కొత్త ఫోన్పై రిలయన్స్ నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన రాలేదు.