జగన్‌ని దొంగ దెబ్బ తీయడానికి సిద్ధమైపోయారా? ఆడలేక మద్దెలే..

ఆదివారం, 29 జనవరి 2017 (02:52 IST)
ప్రత్యేక హోదాపై రాష్ట్ర యువతను విశేషంగా ప్రభావితం చేసిన వైకాపా అధినేత జగన్‌పై దొంగ దెబ్బతీయడానికి తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధమైపోయిందా? భూస్థాపితమైపోయిందనుకున్న ప్రత్యేక  హోదాను మళ్లీ పైకి లాగి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో హోదా జ్ఞాపకాలను మళ్లీ బలంగా నాటిన  వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీ సాక్షిగా బలహీనపర్చడానికి రంగం సిద్ధమైందా అంటే అవుననే చెప్పాలి. 
 
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుని.. రభస సృష్టించి.. విధ్వంసానికి పాల్పడినందుకు వైసీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలపై చర్యకు సిఫార్సు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సభా హక్కుల కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. వీరిలో దాడిశెట్టి రాజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, బి.ముత్యాలనాయుడు, కె.శ్రీనివాసులు ఉన్నారు. చైర్మన్‌ గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన ఈ కమిటీ సమావేశం శనివారం ఇక్కడ అసెంబ్లీ ఆవరణలో జరిగింది. గత సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రత్యేక హోదాను డిమాండ్‌ చేస్తూ సమావేశాలను అడ్డుకున్నారు. ఈ సమయంలో కొందరు ఎమ్మెల్యేలు స్పీకర్‌ స్థానం వద్దకు దూసుకెళ్లి రభస సృష్టించడం, కొందరు అసెంబ్లీ సిబ్బందిపై దాడి చేయడం వంటి ఘటనలు జరగడంతో వాటిపై సభా హక్కుల కమిటీతో విచారణ జరిపించాలని అసెంబ్లీ తీర్మానించింది.
 
ఆ మేరకు కమిటీ పలుమార్లు సమావేశమై విచారణ జరిపింది. అసెంబ్లీ లోపల ఉన్న కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా మొత్తం 12 మంది వైసీపీ ఎమ్మెల్యేలను పిలిపించి ఆ దృశ్యాలు చూపించి వివరణ కోరింది. వీరిలో ఐదుగురు ఎమ్మెల్యేల తీరు, వారి సమాధానాలపై కమిటీ అసంతృప్తి వ్యక్తంచేసింది. కమిటీ ముందు హాజరైన వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరు తమకు తెలియకుండా జరిగిన తప్పిదమంటూ క్షమాపణ కోరడంతో వారి విషయం పక్కన పెట్టారు. 
 
శనివారం జరిగిన తుది సమావేశంలో ఇవన్నీ చర్చించి పై ఐదుగురిపై చర్చకు సిఫారసు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రతి ఎమ్మెల్యే పేరు ఎదుట వారు చేసిన తప్పు... వ్యవహరించిన తీరును విపులంగా పేర్కొంటూ నివేదిక రూపొందించాలని సమావేశం నిర్ణయించింది. తమ నివేదికను ఫిబ్రవరి మొదటివారంలో సభాపతి కోడెల శివప్రసాదరావుకు అందజేస్తామని చైర్మన్‌ సూర్యారావు మీడియాకు తెలిపారు. 
 
విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో ప్రత్యేక హోదాకోసం కొవ్వొత్తుల ర్యాలీకి  పిలుపునిచ్చి, వైజాగ్ విమానాశ్రయంలో పోలీసుల నిర్బంధానికి గురై కూడా రాజీలేని పోరాటం చేసి సీమాంధ్రులను విశేషంగా ప్రభావితం చేసిన వైఎస్ జగన్‌ని నేరుగా రాజకీయంగా ఎదుర్కొనలేక అసెంబ్లీలో జరిగిన ఘటనల సాకుతో వైకాపా ఎమ్మెల్యేలపై చర్యకు చంద్రబాబు ప్రభుత్వం చేయడం సంచలనం గొలుపుతోంది.

వెబ్దునియా పై చదవండి