మెజార్టీ స్థానాలు గెలుచుకుంటే ప్రధానిగా రాహుల్ : ఆనంద్ శర్మ

సోమవారం, 22 ఏప్రియల్ 2019 (09:45 IST)
దేశంలో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అత్యధిక స్థానాలు గెలుచుకుంటే ప్రధానిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపడుతారని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ తెలిపారు. ఆయన గోవాలో మీడియాతో మాట్లాడుతూ, 2004లో నాటి వాజపేయి ప్రభుత్వం వెలిగిపోతున్న భారత్ అనే నినాదంతో ప్రచారాన్ని ప్రారంభించినప్పుడు ఏమైంది. ఇప్పుడు అదే జరుగుతుందన్నారు. 
 
ప్రస్తుత ఎన్నికల్లో 2004 ఫలితాలనే ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన సారథ్యంలోని ఎన్డీయే ఎదుర్కోవాల్సి వస్తుంది. నేనేమీ జ్యోతిష్కుడిని కాదు. కానీ మోడీ మళ్లీ ప్రధాని కారు. బీజేపీ ఓటమి ఖాయమని ఆనంద్ శర్మ స్పష్టం చేశారు. తదుపరి ప్రధాని ఎవరన్నది ఆయా పార్టీల అధినేతలు నిర్ణయిస్తారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు తదుపరి ప్రధాని రాహుల్‌గాంధేనని తేల్చి చెప్పారు. 
 
ఇకపోతే, ఎన్నికల ముందు కూటములతోపాటు తర్వాత సంకీర్ణ కూటములు ఉంటాయి. ఇది ఫలితాలపైనే ఆధారపడి ఉంటుందన్నరు. అయితే, అత్యధిక సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది అని ఆనంద్‌ శర్మ విశ్వాసం వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో వాగ్దానాలను అమలు చేయనందుకు ప్రధాని జాతికి క్షమాపణ చెప్పాలన్నారు. 
 
ప్రధాని మోడీ, బీజేపీ తమ ఎన్నికల ప్రచారంలో భావోద్వేగ పూరిత అభ్యర్థనలకు ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇది సిగ్గుచేటని ఆనంద్ శర్మ విమర్శించారు. దేశం కోసం ఇద్దరు మహానేతలు ప్రాణత్యాగం చేసిన పార్టీ కాంగ్రెస్ అని.. ఇతరుల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన గత్యంతరం తమకు లేదని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు