పొరుగు దేశాలపై డేగ కన్ను: ఎలక్ట్రానికి నిఘా వ్యవస్థ!

శత్రు దేశాల నుంచి ఎదురయ్యే ముప్పును ముందుగానే పసిగట్టేందుకు వీలుగా భారత్ తన గూఢచార నిఘా వ్యవస్థను మెరుగుపరుస్తోంది. ఇందులోభాగంగా.. పొరుగు దేశాల కదలికలపై నిరంతరం డేగకన్ను వేసి ఉంచడానికి అవసరమైన నిఘా పెట్టి ఉంచగల ఎలక్ట్రానికి గూఢచార వ్యవస్థను రూపొందించింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ అధీనంలోని హైదరాబాద్‌కు చెందిన రక్షణ ఎలక్ట్రానిక్స్, పరిశోధనా లేబోరేటరీ (డిఆర్‌డిఎల్) ఈ వ్యవస్థను రూపొందించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఉపగ్రహానికి బిగించే ఈ పరికరాన్ని "స్పై శాటిలైట్’ (గూఢచార ఉపగ్రహం)గా డిఆర్‌డిఓ అధికారి ఒకరు అభివర్ణించడం గమనార్హం.

మన దేశంపై కయ్యానికి కాలుదువ్వే పొరుగుదేశం మీదుగా ఉపగ్రహం వెళ్లేటప్పుడు ఉపగ్రహానికి బిగించిన ఈ పరికరం, ఆ దేశ బలగాలు, ఇతర వనరులకు సంబంధించిన ఫోటోలు తీస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. అగ్రరాజ్యాలైన అమెరికా, ఫ్రాన్స్, చైనా లాంటి దేశాలు ఇప్పటికే ఈ తరహా వ్యవస్థను కలిగి ఉన్నట్టు ఆ వర్గాలు గుర్తు చేశాయి.

వెబ్దునియా పై చదవండి