43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

సెల్వి

శుక్రవారం, 23 మే 2025 (22:13 IST)
నాలుగు దశాబ్దాలకు పైగా జైలులో గడిపిన వ్యక్తి చివరకు నిర్దోషిగా విడుదలయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన అరుదైన ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఓ హత్య కేసులో సుమారు 43 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించిన 104 ఏళ్ల వృద్ధుడిని నిర్దోషిగా ప్రకటించి విడుదల చేశారు.
 
ఈ సంఘటన ఆగస్టు 16, 1977 నాటిది. ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఉన్న గౌరాయే గ్రామంలో రెండు గ్రూపుల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది. ఘర్షణ సమయంలో, ప్రభు సరోజ్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. హత్య, హత్యాయత్నం ఆరోపణలకు సంబంధించి, లఖన్ అనే వ్యక్తితో పాటు మరో ముగ్గురిని నిందితుడిగా చేర్చారు. విచారణ తర్వాత, 1982లో ప్రయాగ్‌రాజ్‌లోని జిల్లా సెషన్స్ కోర్టు నలుగురికి జీవిత ఖైదు విధించింది.
 
జిల్లా కోర్టు తీర్పును సవాలు చేస్తూ, నలుగురు దోషులు అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. అయితే, అప్పీల్ ప్రక్రియ కొనసాగుతుండగా, సహ నిందితులలో ముగ్గురు మరణించారు. సుదీర్ఘ న్యాయ ప్రక్రియ తర్వాత, అలహాబాద్ హైకోర్టు విచారణను ముగించి, మే 2న తుది తీర్పు వెలువరించింది, లఖన్ నిర్దోషి అని ప్రకటించింది. 
 
జైలు రికార్డుల ప్రకారం, లఖన్ జనవరి 4, 1921న జన్మించాడు. హత్య ఆరోపణలపై 1977లో అరెస్టు అయినప్పటి నుండి అతను జైలులోనే ఉన్నాడు. ప్రస్తుతం 104 ఏళ్ల వయసులో ఉన్న లఖన్ నిర్దోషి అని కోర్టు తీర్పు ఇవ్వడంతో విడుదలయ్యాడు. జైలు అధికారులు అతన్ని అదే జిల్లాలోని షరీరా గ్రామంలో నివసిస్తున్న అతని కుమార్తె సంరక్షణకు అప్పగించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు