జమ్మూకాశ్మీర్లో ఉగ్రమూకలు రెచ్చిపోయారు. బారాముల్లలోని యూరీ సెక్టార్లోగల ఆర్మీ కార్యాలయంపై ఆదివారం ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దాడులను తిప్పికొట్టారు. ఈ ఎన్కౌంటర్లో 17 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో నలుగురు టెర్రరిస్టులు హతమార్చారు. అయితే జవాన్ల మృతిని ఆర్మీ అధికారికంగా ధృవీకరించలేదు.
యూరీ సెక్టార్లో ఎన్కౌంటర్పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమీక్షించారు. రక్షణ మంత్రి పరీకర్, ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ ఘటనాస్థలికి వెళ్లనున్నారు. ఉగ్రదాడి తర్వాత కేంద్రం అప్రమత్తమైంది. ఎల్వోసీ సహా బారాముల్లా..యూరీ సెక్టార్లో రహదారులు మూసివేశారు. మరోవైపు ఈ ఘటనతో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ అత్యవసరంగా సమావేశమయ్యారు.
కాశ్మీర్లో ఉగ్రదాడితో కేంద్రం మేల్కొంది. దేశమంతటా అప్రమత్తత ప్రకటించారు. కాశ్మీర్లో జరిగిన భారీ ఎన్ కౌంటర్పై చర్చిస్తున్నారు. ఇదిలా ఉంటే.. యూవి సెక్టార్లో జరిగిన దాడిపై నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. జవాన్లు వీరమరణం పొందడం పట్ల కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు సంతాపం తెలియ చేశారు. జవాన్లు మృతి చెందడంపై వామపక్షాల నేతలు కూడా తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.