భారత్ అబ్బాయి-పాక్ అమ్మాయి.. ప్రేయసి కోసం బైక్‌పై జర్నీ.. బార్డర్ వద్ద బ్రేక్

శుక్రవారం, 17 జులై 2020 (21:26 IST)
ప్రేమ అంటే అంతేనేమో. ప్రేమ ఎంతటి సాహసానికైనా సిద్ధమవుతుందని చెప్పేందుకు ఈ కథనమే నిదర్శనం. పాకిస్థాన్ అమ్మాయిని భారత అబ్బాయి ప్రేమించాడు. అతడి ప్రేమ ఫేస్‌బుక్‌తో ప్రారంభమై.. వాట్సాప్ వరకు వచ్చింది. ప్రేయసిని చూసేందుకు బైక్‌లోనే పాకిస్థాన్‌కు బయల్దేరాడు.. ప్రియుడు. కానీ బార్డర్‌లో దొరికిపోయాడు. 
 
వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఓ 20 ఏళ్ల యువకుడిని బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది గురువారం పట్టుకున్నారు. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌కు చెందిన సిద్దిఖీ మొహమ్మద్ జిషాన్ అనే యువకుడు.. పాకిస్థాన్‌ కరాచీలోని షా ఫైసల్ పట్టణానికి చెందిన తన ప్రియురాలిని కలుసుకోవడానికి ఏకంగా 1200 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. 
 
కానీ సరిహద్దు వద్ద దొరికిపోయాడు. సోషల్ మీడియా వేదికగా వీరి ప్రేమాయణం మొదలైంది. ఇక ప్రేయసిని ఎలాగైనా కలవాలని... కరోనాను కూడా లెక్కచేయని ప్రియుడు 1200కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. అదీ బైకుపైనే. గూగుల్‌ మ్యాప్‌ ద్వారా భారత్‌-పాక్ సరిహద్దు వరకు చేరుకున్నాడు. సెర్చ్ ఆపరేషన్ సమయంలో బీఎస్‌ఎఫ్ జవాన్లకు పట్టుబడ్డాడు. 
 
రాన్ ఆఫ్ కచ్ దాటడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతడు స్పృహ తప్పాడని సిబ్బంది తెలిపారు.. అయితే, అతడి వద్ద లభించిన ఏటీఎం కార్డు, ఆధార్‌, పాన్‌ కార్డు ఆ యువకుడిని గుర్తించారు. ఇక, అప్పటికే యువకుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. మహారాష్ట్రలో మిస్సింగ్ కేసు నమోదైంది. ఇక, బీఎస్ఎఫ్ సిబ్బంది ఆ యువకుడిని పోలీసులకు అప్పగించారు. మొత్తానికి 20 ఏళ్ల కుర్రాడి ప్రేమ బార్డర్ వరకు వెళ్లి బ్రేక్ పడినట్లైంది. మరి ఆ యువకుడు ప్రేయసిని ఎలా కలుస్తాడో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు