గత 2008లో మహారాష్ట్రల మాలేగావ్లో జరిగిన స్కూటర్ బాంబు పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టు గురువారం సంచలన తీర్పునిచ్చింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాగూర్తో సహా మిగిలిన నిందితులందరినీ నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. ఈ కేసులో ప్రజ్ఞా ఠాగూర్, లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్ సహా మొత్తం ఏడుగురు అభియోగాలు ఎదుర్కొన్నారు.
సుధీర్ఘ విచారణ జరిగిన ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొన్నవారంతా నిర్దోషులుగా ఎన్.ఐ.ఏ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. తీర్పు సందర్భంగా కోర్టు ప్రాసిక్యూషన్ వాదనల్లో లోపాలను ఎత్తిచూపింది. బాంబును స్కూటర్కు అమర్చి పేలుడు జరిపారన్న విషయాన్ని ప్రాసిక్యూషన్ నిర్ధారించలేకపోయిందని, తగిన ఆధారాలు చూపలేకపోయిందని పేర్కొంది.
కాగా, మహారాష్ట్రలోని మాలేగావ్లో 2008 సెప్టెంబరు 29వ తేదీన భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వంద మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసును తొలుత యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ దర్యాప్తు చేపట్టగా కేసు తీవ్రత దృష్ట్యా ఈ కేసు విచారణను ఎన్.ఐ.ఏకు బదిలీ చేసింది.
ఈ పేలుళ్లకు సంబంధించి అప్పటి ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్పై ఆరోపణలు వచ్చాయి. ఠాకూర్కు చెందిన మోటార్ సైకిల్కు బాంబు అమర్చారని దర్యాప్తులో తేలిందని అధికారులు చెప్పారు. దీంతో ఈ కేసులో ప్రజ్ఞా ఠాకూర్ను నిందితురాలిగా చేర్చారు. ఈ కేసులో ఇప్పటివరకు 220మంది సాక్షులను విచారించగా, వారిలో 15 మంది అంతకుముందు తామిచ్చిన వాంగ్మూలాలకు విరుద్దంగా ఫ్లేటు ఫిరాయించడం గమనార్హం.