ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ : పెరుగుతున్న మృతులు.. 22 మంది జవాన్ల మృతి

ఆదివారం, 4 ఏప్రియల్ 2021 (14:14 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రలో అతిపెద్ద ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో 22 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. నిజానికి ఈ ఎన్‌కౌంటర్‌లో కేవలం ఐదుగురు జవాన్లు మాత్రమే ప్రాణాలు కోల్పోయారని భావించారు. కానీ, ఈ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. ఆదివారం మధ్యాహ్నం నాటికి వారి సంఖ్య 22కి పెరిగింది. ఈ మేరకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) అధికారులు ప్రకటించారు. 
 
మరో జవాను మృతదేహం కోసం గాలిస్తున్నట్టు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా - బీజాపూర్ సరిహద్దుల్లో శనివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో మొత్తం 32 మంది జవాన్లు గాయపడినట్టు చెప్పారు. భద్రతా సిబ్బంది నుంచి నక్సలైట్లు భారీగా ఆయుధాలను దోచుకెళ్లారని వెల్లడించారు. 
 
అయితే, చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో అటవీ ప్రాంతమంతా భీతావహంగా మారింది. కాగా, మావోయిస్టులూ భారీగానే హతమైనట్టు అధికారులు చెబుతున్నారు. కాగా, కాల్పుల్లో చనిపోయిన జవాన్ల త్యాగాన్ని వృథా కానివ్వబోమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బాఘల్ అన్నారు.
 
కాగా, జవాన్ల మృతి పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విచారం వ్యక్తం చేశారు. వారికి నివాళులు అర్పించారు. మావోయిస్టులతో పోరాడుతూ జవాన్లు చనిపోయారన్న వార్త కలచివేసిందన్నారు. వారి త్యాగాన్ని దేశ ప్రజలెన్నడూ మరచిపోరన్నారు. చనిపోయిన జవాన్ల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు