ఆయుధాలు వీడి... ప్రజా జీవితంలోకి వచ్చిన మావోయిస్టులు!

ఠాగూర్

మంగళవారం, 27 ఆగస్టు 2024 (12:58 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో పలువురు మావోయిస్టులు ఆయుధాలు వీడి ప్రజాజీవితంలోకి వచ్చారు. ఏకంగా 25 మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇది మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బవంటిదని చెప్పాలి. లొంగిపోయిన 25 మంది మావోయిస్టుల్లో ఐదుగురిపై రూ.28 లక్షల రివార్డులు ఉన్నాయి. లొంగిపోయిన మావోయిస్టుల గురించి బీజూపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ వివరాలు మీడియాకు వెల్లడించారు. లొంగిపోయిన నక్సలైట్లు గంగ్లూర్, బైరామ్ గఢ్ ఏరియా కమిటీల్లో క్రియాశీలకంగా పని చేశారని చెప్పారు.
 
ఇద్దరు మహిళా నక్సలైట్‌‌లు కూడా లొంగిపోయినవారిలో ఉన్నారని తెలిపారు. శంబరి మద్యం (23), జ్యోతి పునెం (27), మహేశ్ తేలంపై ఒక్కొక్కరి తలపై రూ.8 లక్షల చొప్పున రివార్డు ఉందని చెప్పారు. శంబరి మద్యం అనే మహిళ 2012లో నుండి ఉద్యమంలో కీలకంగా పని చేశారనీ, 2020లో సుక్మా జిల్లాలో, 2021లో బిజాపూర్ లో భద్రతా సిబ్బందిపై జరిగిన భారీ దాడుల ఘటనల్లో ఆమె పాత్ర ఉందని ఎస్పీ తెలిపారు. 
 
లొంగిపోయిన విష్ణుకర్తమ్ అలియాస్ మోను, జైదీప్ పాడియంలపైనా రివార్డులు ఉన్నాయన్నారు. మావోయిస్టు భావజాలం పట్ల నిరాశ, ఉద్యమ నేతల దౌర్జన్యాల కారణంగా వీరు లొంగిపోయినట్లు ఎస్పీ చెప్పారు. లొంగిపోయిన వీరికి రూ.25 వేల చొప్పున సాయంతో పాటు ప్రభుత్వ పాలసీ ప్రకారం పునరావాసాన్ని కల్పిస్తామని ఎస్పీ తెలిపారు. బీజాపూర్ జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకూ 346 మంది నక్సలైట్ లను అరెస్టు చేయగా, 170 మంది లొంగిపోయారని ఆయన తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు