ఉగ్రవాదంపై భారత్ ఉక్కుపాదం మోపుతోంది. ఇందులోభాగంగా, ఉగ్రవాదులు ఎక్కడైనా కనిపిస్తే కాల్చిపడేస్తున్నారు. తాజాగా జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు జరిగిన భారీ కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు ప్రాణాలు కోల్పోయారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సరిహద్దు అవతల ఉన్న ఉగ్రవాద శిబిరాలపై కఠిన చర్యలు తీసుకున్న భద్రతా దళాలు ఇపుడు లోయ లోపల ఉన్న ఉగ్రవాదులపై కూడా ఉగ్రవాద నిర్మూలన చర్యలను తీవ్రతరం చేశాయి.
అధికారులు వెల్లడించిన వివరాల మేరకు... షోపియాన్ జిల్లా పరిధిలోని షుక్రూ కెల్లర్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలకు అందింది. దీంతో అప్రమత్తమైన సైనిక బృందాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. గాలింపుచర్యలు కొనసాగుతుండగా ఓ చోటు దాగివున్న ఉగ్రవాదులు భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు.
దీంతో భద్రతా బలగాలు కూడా తిరిగి కాల్పులు జరపడంతో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. హతమైన ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమంలో భద్రతా బలగాలు నిమగ్నమైవున్నట్టు సైనికాధికారులు వెల్లడించారు.