గురువు చేతిలో అత్యాచారానికి గురైన 5వ తరగతి విద్యార్థిని..

గురువారం, 20 సెప్టెంబరు 2018 (11:43 IST)
దేశంలో మహిళలపై అత్యాచారాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఒకవైపు పరువు హత్యలు జరుగుతుండగా మరోపక్క అత్యాచార ఘటనల వల్ల క్రైమ్ రేట్ మరింత పెరిగిపోతోంది. తాజాగా బీహార్ రాజధాని పాట్నాలో ఇలాంటి ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. చదువు చెప్పాల్సిన గురువులే విద్యార్థిని పట్ల అమానుషంగా ప్రవర్తించి, ఆమెను అత్యాచారం చేసారు. 
 
వివరాల్లోకెళితే, ఒక ప్రైవేట్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న 11 సంవత్సరాల విద్యార్థినిపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, అలాగే క్లర్క్ అత్యాచారం చేయడమే కాకుండా ఆ సన్నివేశాలను చిత్రించి, ఆమెను లైంగికంగా వేధించారు. ఆ బాలిక వాంతులు, కడుపు నొప్పితో బాధపడుతుండటంతో హాస్పిటల్‌కి తీసుకెళ్లిన తల్లిదండ్రులకు డాక్టర్లు షాకింగ్ విషయాన్ని తెలియజేసారు. ఆమె గర్భవతి అయ్యిందని చెప్పారు. 
 
తల్లిద్రండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వెంటనే ఆ ప్రధానోపాధ్యాయుడు మరియు క్లర్క్‌ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు ఆ బాలికను తన ఆఫీస్ ప్రక్కనే ఉన్న విశ్రాంతి గదిలో అత్యాచారం చేయగా దానిని బయట నుండి క్లర్క్ వీడియో చిత్రించి, ఆ వీడియోను చూపించి క్లర్క్ కూడా ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు తెలియజేసారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉండటంతో పాఠశాలను కూడా మూసివేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు