కరోనా చికిత్సకు 69 ఔషధాలు గుర్తింపు!

గురువారం, 26 మార్చి 2020 (18:43 IST)
ప్రపంచాన్నే కలవరపెడుతున్న కరోనా వైరస్కు వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాలు రోజురోజుకూ ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు బలిగొన్న ఈ మహమ్మారికి వైద్య నిపుణలు ఇంకా విరుగుడు మందు కనిపెట్టలేదు.

అయితే క్యాన్సర్, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులకు వినియోగించే దాదాపు 69 ఔషధాలు.. కరోనా చికిత్సలో మెరుగ్గా పనిచేస్తున్నట్లు తాజాగా వెల్లడించారు అమెరికా శాస్త్రవేత్తలు. కరోనా వైరస్ చికిత్సలో 69 డ్రగ్స్ మెరుగ్గా పనిచేస్తున్నట్లు భారతీయులతో కూడిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం కనుగొంది. వీటిలో కొన్నింటిని క్యాన్సర్, డయాబెటిస్(మధుమేహం), హైపర్టెన్షన్(రక్తపోటు) వంటి వ్యాధులకు ఔషధాలుగా ఇప్పటికే వినియోగిస్తున్నట్లు గుర్తుచేసింది.

అలాగే కొవిడ్-19 చికిత్సకు కొత్త వ్యాక్సిన్ కనుగొనడం కంటే వేగంగా వీటినే పునర్వినియోగించొచ్చని అంటోంది. ఈ మేరకు ప్రీ-ప్రింట్ వెబ్సైట్ బయోఆర్ఎక్సివ్లో ఓ అధ్యయనం ప్రచురించింది అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో(యూసీఎస్ఎఫ్) వైద్య పరిశోధకుల బృందం. భారత్కు చెందిన అద్వైత్ సుబ్రమణియన్, శ్రీవాస్త్ వెంకటరమణన్, జ్యోతి బాత్రా ఈ వైద్య బృందంలో భాగంగా ఉన్నారు.

కరోనా వైరస్లో వైరల్ ప్రొటీన్స్ను ప్రత్యక్షంగా ఉత్పత్తి చేసే 29 సార్స్-సీఓవీ-2 జీన్స్లోని 26 జీన్స్పై పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. మానవ శరీరంలోని దాదాపు 332 ప్రొటీన్లు సార్స్-సీఓవీ-2 వైరల్ ప్రొటీన్లతో అనుసంధానమవుతున్నట్లు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా 4.7లక్షల మందికిపైగా ఈ మహమ్మారి బారిన పడటానికి, 21వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోవడానికి ఈ ప్రొటీన్లే కారణమవుతున్నట్లు గుర్తించారు.

కరోనాలోని కొన్ని వైరస్ ప్రొటీన్లు మనిషిలోని ఒకే ప్రొటీన్పై ప్రభావం చూపుతుండగా.. మరికొన్ని మాత్రం డజన్ల కొద్దీ మానవ ప్రొటీన్లపై ప్రభావం చూపుతున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు