ఆధార్ అనుసంధాన గడువు నిరవధిక పొడగింపు : సుప్రీంకోర్టు

మంగళవారం, 13 మార్చి 2018 (18:09 IST)
ఆధార్ నంబరు అనుసంధాన ప్రక్రియకు సంబంధించి గడువును సుప్రీంకోర్టు నిరవధికంగా పొడగించింది. ఈ కేసు విచారణ పూర్తయ్యేంతవరకు ఆధార్ నంబరు అనుసంధాన ప్రక్రియను తప్పనిసరి చేయరాదని స్పష్టంచేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. 
 
గతేడాది డిసెంబరు 15న బ్యాంకు ఖాతాలు, మొబైల్ నెంబర్లతో ఆధార్ అనుసంధానానికి తుది గడువును సుప్రీంకోర్టు ఈ నెలాఖరు వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. దీనిపై మరోమారు విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం ఈ మధ్యంతర తీర్పు ఆధార్‌ రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై తుది తీర్పును వెలువరిచేంతవరకు అమల్లో ఉంటుందని బెంచ్ తెలిపింది. 'చివరికి తత్కాల్ పాస్‌పోర్టు జారీకి కూడా ప్రభుత్వం ఆధార్‌ను తప్పనిసరిగా కోరరాదు' అని స్పష్టంచేసింది.
 
ముఖ్యంగా, ఈనెలాఖరుతో బ్యాంకు ఖాతాలు, మొబైల్ నెంబర్లతో 'ఆధార్' అనుసంధాన గడువు ముగియనుంది. దీన్ని సుప్రీంకోర్టు మంగళవారం నిరవధికంగా పొడిగించింది. సబ్సిడీ ఇవ్వడానికి తప్ప మిగిలిన వాటికి ఆధార్‌ను తప్పనిసరిగా అనుసంధానం చేయాలని డిమాండ్ చేయొద్దని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు