కోల్‌కతా యువకుడిని పెళ్లాడేందుకు భారత్ వచ్చిన పాకిస్థాన్ యువతి..

బుధవారం, 6 డిశెంబరు 2023 (09:53 IST)
తాను ప్రేమించిన యువకుడిని వివాహం చేసుకునేందుకు ఓ పాకిస్థాన్ యువతి భారత్‌కు వచ్చింది. కోల్‌కతాకు చెందిన యువకుడిని వివాహం చేసుకునేందుకు ఆమె భారత్‌కు వచ్చారు. పాకిస్థాన్‌లోని కరాచీ నగరానికి చెందిన జవేరియా ఖానుమ్.. వాఘా-అట్టారి అంతర్జాతీయ సరిహద్దులో మంగళవారం భారత్‌లో అడుగుపెట్టింది. ఆమెకు కాబోయే భర్త సమీర్ ఖాన్, అతడి కుటుంబ సభ్యులు ఖానుమ్‌కు ఘనస్వాగతం పలికారు. వాయిద్యాలతో భారత్‌లోకి ఆహ్వానించారు. వీరిద్దరి వివాహం వచ్చే ఏడాది జనవరిలో నిశ్చయమైంది. 
 
45 రోజుల వీసాపై ఖానుమ్ భారత్‌లో అడుగుపెట్టింది. గతంలో రెండు సార్లు వీసా తిరస్కరణకు గురైందని, అదృష్టం కొద్ది మూడోసారి వీసా మంజూరైందని ఆమె మీడియాకి తెలిపింది. కొవిడ్ మహమ్మారి ప్రభావం కారణంగా ఐదేళ్లపాటు ఎదురుచూడాల్సి వచ్చిందని తెలిపింది. ఈ మేరకు భారత్‌లోకి ప్రవేశించాక కొద్దిసేపు మీడియాతో ఆమె మాట్లాడింది. వచ్చే నెల జనవరిలో పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిపింది.
 
భారత్ రావడం తనకు చాలా సంతోషంగా ఉందని, ఇక్కడకు వచ్చిన వెంటనే చాలా ప్రేమ, ఆప్యాయతలు లభిస్తున్నాయని ఖానుమ్ చెప్పింది. 'సంతోషకరమైన ముగింపు, ఆనందకరమైన ఆరంభం' అంటూ పెళ్లిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. పాకిస్థాన్‌లోని తన ఇంటి వద్ద అందరూ చాలా సంతోషంగా ఉన్నారని వెల్లడించింది. ఐదేళ్ల తర్వాత వీసా మంజూరు కావడాన్ని నమ్మలేకపోతున్నానని పేర్కొంది.
 
కాగా తన తల్లి మొబైల్లో ఖానుమ్ ఫొటో చూశానని ఖాన్ చెప్పాడు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు అమ్మతో చెప్పానని వెల్లడించాడు. ఈ కథ 2018లో ప్రారంభమైందని వెల్లడించాడు. చదువు అనంతరం జర్మనీ నుంచి ఇంటికి వచ్చాక అమ్మ ఫోనులో ఆమె ఫోటో చూశానని వివరించాడు. వీసా మంజూరు చేసిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాడు. మీడియాతో మాట్లాడిన అనంతరం దంపతులు అమృతసర్ నుంచి కోల్‌కతాకు బయలుదేరి వెళ్లారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు