పెళ్లి కట్నంగా కొబ్బరి బోండం.. దేశానికి ఆదర్శనంగా నిలిచిన జవాను!

బుధవారం, 2 డిశెంబరు 2020 (09:31 IST)
ఈ కాలంలో పెళ్ళిల్లు చేయాలంటే తలకుమించిన భారంగా మారింది. ముఖ్యంగా, ఆడపిల్ల చేయాలంటే ఉన్న ఆస్తులన్నింటినీ విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఆ ప్రభుత్వ ఉద్యోగి మాత్రం తన పెళ్లికి కట్నంగా కేవలం ఒక్క రూపాయి, ఒక్క కొబ్బరి బోండాంను మాత్రమే కట్నంగా తీసుకుని దేశానికే ఆదర్శంగా నిలిచాడు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీలోని లక్నోకు సమీపంలో ఉన్న గంగోహ్ పరిధిలోని జుఖెడి గ్రామనివాసి సంజయ్ కుమార్ కుమారుడు వివేక్ కుమార్‌కు బీన్డాకు చెందిన అరవింద్ కుమార్ కుమార్తె ప్రియతో నవంబరు 30వ తేదీన వివాహం జరిగింది. 
 
ఈ సందర్భంగా వధువు తల్లిదండ్రులు కట్నకానుకల రూపంలో లక్షల రూపాయలు ఇవ్వాలనుకున్నారు. అయితే వరుడు వివేక్ తనకు ఎటువంటి కట్నకానుకలు వద్దని కేవలం ఒక్క రూపాయి, కొబ్బరిబోండంచాలని, వాటినే స్వీకరించారు. వధువే తనకు అందమైన కట్నమని తెలిపారు. 
 
వధువు ప్రియ కూడా తనకు కాబోయే భర్త ఆదర్శభావాలకు మురిసిపోయింది. కాగా వివేక్, ప్రియలకు యేడాది క్రితమే నిశ్చితార్థం జరిగినా, వివేక్ ఉద్యోగ బాధ్యతల కారణంగా పెళ్లి వాయిదా పడింది. వివేక్‌ను ఇటీవలే లక్నోకు బదిలీ చేశారు. దీంతో వీరి పెళ్లికి ఆటంకాలు తొలగిపోయినట్లయ్యింది. 
 
కాగా, దేశంలో వరకట్నవ్యవస్థను రూపుమాపాలనే సందేశమిస్తూ సైనికుడు వివేక్ చేసుకున్న వివాహం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ జవానును ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు