ఢిల్లీ లిక్కర్ స్కామ్ : ఈడీ విచారణకు మళ్లీ డుమ్మాకొట్టిన సీఎం కేజ్రీవాల్

గురువారం, 21 డిశెంబరు 2023 (11:13 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మరోమారు గైర్హాజరయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పంపిన నోటీసులను ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ నోటీసులు రాజకీయ ప్రేరేపితమైనవని, అక్రమమని, ఈడీకి ఆయన ఘాటుగా బదులిచ్చారు. ఈ నోటీసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తాను నీతి నిజాయితీలతో జీవిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. 
 
ఈ కేసుకు సంబంధించి గతంలోనూ ఆయనకు ఈడీ నోటీసులు జారీచేసిన విషయం తెల్సిందే. నవంబరు 2వ తేదీన విచారణకు రావాలని కోరగా, మధ్యప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సివుందని, ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకోవడానికే ఈ నోటీసులు కేంద్రం పంపింపిందని కేజ్రీవాల్ ఆరోపించారు. దీంతో ఆయన ఆ విచారణకు వెళ్లలేదు. దీంతో నోటీసులను వెనక్కి తీసుకున్న ఈడీ.. తాజాగా ఈ నెల 21వ తేదీన విచారణకు హాజరుకావాలంటూ మరోమారు నోటీసులు జారీచేసింది. అయితే, ఈసారి కూడా డుమ్మా కొట్టారు. 
 
కాగా, ప్రస్తుతం ఆయన పంజాబ్ రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామంలో విపాసన ధ్యాన కోర్సు చేస్తున్నారు. దీంతో ఆయన మరో వారం రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ కోర్సుకు హాజరయ్యేందుకు కేజ్రీవాల్ మంగళవారమే బయలుదేరి వెళ్లాల్సివుంది. అయితే, ఇండియా కూటమి ఉండటంతో కేజ్రీవాల్ తన కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు