'యూత్ ఐకాన్‌'గా ఆయుష్మాన్ ఖురానా.. ఎన్నికల సంఘం నిర్ణయం!!

ఠాగూర్

బుధవారం, 3 ఏప్రియల్ 2024 (11:20 IST)
బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానాకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) యూత్ ఐకాన్‌గా నియమించింది. యువ ఓటర్లను చైతన్యవంతులను చేసే దిశగా ఆయన ప్రచారం చేస్తారు. ఈ మేరకు మంగళవారం కీలక ప్రకటన విడుదల చేసింది. అలాగే ఈసీ తమ అధికారిక యూట్యూబ్, 'ఎక్స్' ఖాతాలలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆయుష్మాన్ ఖురానా దేశ ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ కనిపించారు.
 
దేశ ప్రజలకు ఆయుష్మాన్ ఖురానా ప్రత్యేక విజ్ఞప్తి.. "2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఓటింగ్‌ను ప్రోత్సహించడానికి ఎన్నికల కమిషన్ ప్రతియేటా కొంతమంది సినీ నటులకు యూత్ ఐకాన్‌గా బాధ్యతను అప్పగిస్తుంది. ఈసారి ఆయుష్మాన్ ఖురానాకు ఈ పెద్ద అవకాశం దక్కింది. దీనిలో భాగంగా మంగళవారం తన అధికారిక ఎక్స్ ఖాతాలో అతడు ఓ వీడియోను పంచుకున్నాడు. ఈ వీడియోలో ఆయుష్మాన్ ఖురానా సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయాలని దేశ ప్రజలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వివిధ దశల్లో ఎన్నికలు జరగనున్నాయని, అలాంటి పరిస్థితుల్లో రోజు, తేదీలను బట్టి ఖచ్చితంగా ఒక్కరోజు మీ వంతు వచ్చినప్పుడు ఓటు వేయాలని కోరారు.
 
ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికలు ఒక పండుగ అని, మనం అందరం మన విలువైన ఓట్లు వేయడం ద్వారా ఈ పండుగను ఘనంగా జరుపుకోవాలని వీడియో ద్వారా ఆయుష్మాన్ ఖురానా దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక ఆయుష్మాన్‌కు ఈ కీలక బాధ్యత దక్కడంలో ఆయన పలు చిత్రాల్లో పోషించిన సోషల్ మెసేజ్లతో కూడిన పాత్రలు కూడా కారణం అని చెప్పాలి. కాగా, ఇంతకుముందు మరో బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావును కూడా భారత ఎన్నికల సంఘం నేషనల్ యూత్ ఐకాన్ నియమించిన సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు