బాబా సిద్ధిఖీ హత్య కేసు : నిందితుడు ధర్మరాజ్ కశ్యప్ మైనర్ కాదు

ఠాగూర్

సోమవారం, 14 అక్టోబరు 2024 (10:30 IST)
అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య కేసు నిందితుల్లో ఒకడైన ధర్మరాజ్ కశ్యప్ మైనర్ కాదని తేలింది. తాను మైనర్ అని చెప్పడంతో ముంబై కోర్టు ఆదేశాల మేరకు అతనికి బోన్ అసిఫికేషన్ టెస్ట్ (ఎముకల పరిణామం తెలుసుకునే పరీక్ష) నిర్వహించారు. ఇందులో అతడు మైనర్ కాదని తేలింది. దీంతో అతడిని కూడా ఇతర నిందితులతో  పాటు ఈ నెల 21వ తేదీ వరకు జ్యూడీషియల్ కస్టడీకి కోర్టు ఆదేశించింది. 
 
మహారాష్ట్ర మాజీ మంత్రి, అజిత్ పవార్ వర్గం నేత అయిన సిద్ధిఖీని శనివారం రాత్రి ఆయన కార్యాలయం బయట కొందరు దుండుగులు కాల్చి చంపిన విషయం తెల్సిందే. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు షూటర్లతోపాటు సహ నిందితుడైన మరో వ్యక్తిని ఆదివారం అరెస్టు చేశారు. ఈ ఘటనకు పాల్పడింది తామేనని బిష్ణోయ్ గ్యాంగ్‌స్టర్ వర్గం ప్రకటించింది. పోలీసులు దీనిని కాంట్రాక్ట్ హత్యగా ధ్రువీకరించారు. షూటర్లలో ఒకడైన ధర్మరాజ్ కశ్యప్ ఉత్తరప్రదేశ్‌కు చెందినవాడు కాగా, మరో నిందితుడిని గుర్‌మైల్ బల్జీత్ సింగ్‌గా గుర్తించారు. 
 
అయితే, ఈ కేసులో నిందితులను కోర్టు ఎదుట ప్రవేశపెట్టగా కశ్యప్ తనకు 17 ఏళ్లని చెప్పాడు. అయితే, ఆధార్ కార్డు ప్రకారం అతడు 2003లో జన్మించాడని, దీనిని బట్టి అతడి వయసు 21 సంవత్సరాలని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలోనే కోర్టు అతడికి బోన్ అసిఫికేషన్ టెస్టు నిర్వహించాలని ఆదేశించడంతో అసలు విషయం బయటపడింది. 
 
ఈ కేసులో సోదరుడు శుభం లోంకర్‌తో కలిసి హత్య కుట్రలో భాగమైన పూణెకు చెందిన మూడో నిందితుడైన 28 ఏళ్ల వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. గుర్‌మైల్, కశ్యప్‌తోపాటు ఉన్న మూడో షూటర్ శివకుమార్ అలియాస్ శివగౌతమ్ పరారీలో ఉన్నాడు. మరో నిందితుడిని మహ్మద్ జీషాన్ అక్తర్ (21)గా పోలీసులు గుర్తించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు