బీహార్‌లో బంగ్లాదేశ్ పౌరులకు ఓటు హక్కు

ఠాగూర్

ఆదివారం, 13 జులై 2025 (19:25 IST)
బీహార్ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సంసిద్ధత కోసం బీహార్ ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ఓటర్ జాబితా సవరణ సర్వేలో పలు షాకింగ్ విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బీహార్‌లో అక్రమంగా నివాసం ఉంటున్న పలువురు బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ పౌరులు ఓటు హక్కును పొందారు. ఓటర్ జాబితాలో వారి పేర్లు ఉన్నాయని ఈసీ అధికారులు చెబుతున్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఇలాంటి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తామని తెలిపారు. 
 
ఎన్నికల సంఘం చేపట్టిన ఈ సర్వేపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, బీజేపీకి ఈసీ అనుకూలంగా వ్యవహరిస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. అనర్హుల పేరుతో ప్రతిపక్షాల ఓటు బ్యాంకును ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకే ఈ సర్వే చేపట్టిందని ఆరోపించాయి. ఈ విషయంపై ఏడీఆర్ అనే స్వచ్ఛంధ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. అయితే, ఈసీ చేపట్టిన సర్వే రాజ్యాంగబద్ధమేనని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.. ఎన్నికలకు ముందు ఈ తరహా సర్వే చేయడం ఏమిటని ప్రశ్నించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు