కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఈ ఎయిర్పోర్టును బాంబులతో పేల్చివేస్తామంటూ గుర్తు తెలియని అంగతకులు బెదిరించారు. దీంతో ఒక్కసారిగా కలకలం చేలరేగింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది చర్యలు చేపట్టారు. విమానాశ్రయ ప్రాంగణంలో విస్తృత తనిఖీలు చేపట్టారు.
ఎయిర్ పోర్టు అధికారుల సమాచారం మేరకు.. ఆదివారం ఉదయం కార్యాలయానికి ఈ మెయిల్ బెదిరింపు వచ్చింది. అందులో విమానాశ్రయంలో బాంబు పెట్టినట్టు సందేశం ఉంది. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు, భద్రతా సంస్థలు అప్రమత్తం చేసారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా తక్షణమే అదనపు భద్రతా బలగాలను మొహరించారు.
సమాచారం అందుకున్న వెంటనే బాంబు నిర్వీర్య దళాలు రంగంలోకి దిగారు. విమానాశ్రయంలోని అన్ని టెర్మినళ్ళు, అనుమానాస్పద ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్టు అధికారులు తెలిపాు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే, భద్రతా తనిఖీలు పూర్తి చేశారు.
ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపారు అనే విషయాలపై సైబర్ క్రైమ్ విభాగం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. భద్రతా సంస్థలు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాయి. ప్రస్తుతానికి విమానాశ్రయం మొత్తం భద్రతా బలగాల పర్యవేక్షణలో ఉంది. తనిఖీలు పూర్తయ్యే వరకు అప్రమత్తత కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను తెలియాల్సి వుంది.