భారత్ సైనిక దెబ్బకు పాకిస్థాన్ కోలుకునేందుకు నాలుగేళ్లు పడుతుంది : అమిత్ షా

ఠాగూర్

శుక్రవారం, 30 మే 2025 (19:33 IST)
భారత సైనిక దెబ్బకు పాకిస్థాన్ కోలుకోవడానికి కనీసం నాలుగేళ్లు పడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత హోం మంత్రి అమిత్ షా తొలిసారి జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్‌ సందర్భంగా భారత బలగాల ధైర్య సాహసాలను ఆయన కొనియాడారు. 
 
ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మనం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు ప్రతిగా పాకిస్తాన్ సైన్యం మన సరిహద్దుల్లోని పౌరులపై దాడులకు తెగబడింది. అయితే, మన బీఎస్ఎఫ్ దళాలు ఈ దాడులకు అత్యంత సమర్థవంతంగా తిప్పికొట్టాయి అని తెలిపారు. 
 
ఈ క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన సుమారు 118 పోస్టులను మన బలగాలు నాశనం చేశాయని ఆయన వెల్లడించారు. శత్రువుల సమాచార, నిఘా వ్యవస్థలను మనవాళ్లు ఒక్కొక్కటిగా కూల్చివేశారు. ఈ నష్టం నుంచి కోలుకోవడానికి పాకిస్థాన్ కనీసం నాలుగైదేళ్ళు పడుతుంది అని అమిత్ షా పేర్కొన్నారు. 
 
బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ అందించిన సమాచారం ప్రకారం పాకిస్థాన్ సైనిక సమాచార, నిఘా వ్యవస్థలకు ఊహించని స్థాయిలో నష్టం వాటిల్లిందని అమిత్ షా తెలిపారు. కొంతకాలం పాటు పూర్తిస్థాయి సమాచారం ఆధారిత యుద్ధం చేసే స్థితిలో పాకిస్థాన్ లేదని ఆయన అన్నారు. 
 
బీఎస్ఎఫ్ దళాల అప్రమత్తత, స్పష్టమైన వ్యూహరచన, వాటిని విజయవంతంగా అమలు చేసిన తీరును హోం మంత్రి ప్రత్యేకంగా ప్రశంచించారు. భారత సరిహద్దుల్లో ఎలాంటి దాడి జరిగినా, ఆ భారాన్ని మొట్టమొదటి మోసేది బీఎస్ఎఫ్ జవాన్లేనని ఆయన గుర్తుచేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు