రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం : రాష్ట్రపతి ముర్ము

మంగళవారం, 31 జనవరి 2023 (11:21 IST)
దేశ పార్లమెంట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. 2023-24 వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి ఒకటో తేదీన లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. దీన్ని పురస్కరించుకుని మంగళవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తున్నారు. ఆమె ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... కొన్నినెలల క్రితమే అమృత్ మహోత్సవాలు జరుపుకున్నట్టు చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన 75 యేళ్లు ఉత్సవాలను కూడా పూర్తి చేసుకున్నట్టు గుర్తు చేశారు. వచ్చే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకమని ఆమె పునరుద్ఘాటించారు. 
 
దేశం ఆత్మనిర్భర్ భారతంగా ఆవిర్భిస్తుందన్నారు. పౌరులందరి అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. భారత్ ఆత్మ విశ్వాసంతో అడుగులు వేస్తుందని చెప్పారు. గత తొమ్మిదేళ్ల మా ప్రభుత్వంలో పౌరుల ఆత్మ విశ్వాసం పెరిగిందని తెలిపారు. ముఖ్యంగా అవినీతి అంతం దిశగా దేశం అడుగులు వేస్తుందన్నారు. విధాన లోపాన్ని వీడి దేశం ముందడుగు వేస్తుందని తెలిపారు. 
 
అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ, సభ సజావుగా సాగేందుకు విపక్షాలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. విపక్షాలు తమ అభిప్రాయాలను సభలో వ్యక్తపరచాలని కోరారు. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తుందన్నారు. భారత రాజ్యాంగానికి, ఆదివాసీలు, మహిళలకు ఇచ్చిన గౌరవమే రాష్ట్రపతిగా ద్రౌపదిని ఎన్నుకోవడమన్నారు. ఈ దేశానికి రాష్ట్రపతి, ఆర్థిక మంత్రి ఇద్దరూ మహిళలేనని అన్నారు. భారత బడ్జెట్‌పై ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుందన్నారు. దేశంలోని అన్ని అంశాలపై సభలో చర్చ సాగాలని కోరారు. ఇండియా ఫస్ట్.. సిటిజన్ ఫస్ట్‌ను ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు