విదేశీ వ్యాక్సిన్‌లకి కేంద్రం గ్రీన్‌సిగ్నల్

బుధవారం, 2 జూన్ 2021 (12:52 IST)
దేశంలో ఫైజర్‌, మోడెర్నా వ్యాక్సిన్‌ల వినియోగానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్  ఇచ్చింది. ఇందుకోసం  ఆ కంపెనీలు కోరిన  రాయితీలను  ఇచ్చేందుకు,  నష్టపరిహారం చెల్లించేందుకు కూడా సిద్దమేనని ఎటువంటి సమస్య లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలాగే ఆయా కంపెనీలకు చట్టపరమైన భద్రత కల్పిస్తామని సంబంధిదత వర్గాలు పేర్కొన్నాయి.

ఈ కంపెనీలు ఇప్పటికే భారత్‌లో అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకుంటే, వారికి నష్టపరిహారం ఇచ్చేందుకు కూడా సిద్ధమేనని తెలిపాయి. ఈ మేరకు విదేశీ వ్యాక్సిన్‌లను అనుమతి ప్రక్రియల్లో డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డిసిజిఐ) మార్పులు చేసింది. విదేశీ వ్యాక్సిన్‌లపై ఇప్పటివరకు ఉన్న ఆంక్షలను సవరించింది.

దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ ) ఆమోదించిన అన్ని వ్యాక్సిన్‌లను దేశంలోకి అనుమతించింది. దీంతో ఇప్పటికే వివిధ దేశాలు, డబ్ల్యుహెచ్‌ఒ ఆమోదించిన వ్యాక్సిన్లకు దేశంలో మరోసారి క్లినికల్‌ ట్రయల్స్‌ అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఫైజర్‌, మోడెర్నాలాంటి విదేశీ కంపెనీల వ్యాక్సిన్లకు భారత్‌లో మార్గం సుగమమైంది.

దేశంలో వ్యాక్సిన్లకున్న భారీ డిమాండ్‌, కరోనా ఉధఅతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిసిజిఐ తెలిపింది. కరోనా వ్యాక్సిన్‌ల కోసం ఏర్పాటు చేసిన నిపుణుల బృందం డిసిజిఐకి ఈ సిఫారసు చేసింది.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది తీసుకున్న వ్యాక్సిన్లు, యుఎస్‌ఎఫ్‌డిఎ, ఇఎంఎ, యుకెఎంహెచ్‌ఆర్‌ఎ, పిఎండిఎ, జపాన్‌, ఇతర ప్రపంచ ఆరోగ్యం సంస్థ అత్యవసర వినియోగం జాబితాలో ఉన్న వ్యాక్సిన్‌లకు మరోసారి భారత్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ అవసరం లేదని నిర్ణయించినట్లు డిసిజిఐ ఒక లేఖలో తెలిపింది.

కాగా, గతంలో విదేశాల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేసి అనుమతి పొందిన వ్యాక్సిన్లకు భారత్‌లో బ్రిడ్జింగ్‌ ట్రయల్స్‌ లేదా పరిమిత స్థాయిలో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించాలన్న నిబంధన ఉండేది. ఇప్పుడా నిబంధనను ఎత్తివేయడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు