నటి హేమమాలినిపై అభ్యంతరక వ్యాఖ్యలు... కాంగ్రెస్ నేత సుర్జేవాలాపై ఈసీ కొరఢా!

వరుణ్

బుధవారం, 17 ఏప్రియల్ 2024 (11:45 IST)
భారతీయ జనతా పార్టీ ఎంపీ, సినీ నటి హేమమాలిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ నేత రణదీప్ సుర్జేవాలాపై ఎన్నికల సంఘం కొరఢా ఝుళిపించింది. ఆయనను రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా నిషేధం విధించింది. గత నెల 31వ తేదీన కురుక్షేత్ర నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సుర్జేవాలా.. హేమామాలినిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ మేరకు బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాలవీయ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు. సుర్జేవాలా వ్యాఖ్యలు మహిళలను అగౌరవపరిచే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. 
 
అదేసమయంలో సుర్జేవాలాపై తక్షణం చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ కూడా ఈసీకి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం సుర్జేవాలాకు నోటీసులు జారీ చేసింది. అయితే, తన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించిందని సుర్జేవాలా బదులిచ్చారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి వీడియో తన టీం చిత్రీకరించిందని, అందులో ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు ఎక్కడా లేదని పేర్కొన్నారు. అయితే, ఈసీ మాత్రం సుర్జేవాలా రెండు రోజుల పాటు ప్రచారం నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు