బీజేపీకి మరో షాక్ : జార్ఖండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు

సోమవారం, 24 డిశెంబరు 2018 (09:10 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీకి షాక్ తగిలింది. ఆ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కొలెబిరా అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయభేరీ మోగించారు. 
 
సాధారణంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన అభ్యర్థులే సులభంగా గెలుస్తారు. కానీ, ఇటీవల వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. మూడు రాష్ట్రాల్లో అధికారానికి దూరమైంది. 
 
ఈ పరిస్థితుల్లో కొలెబిరా అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నుమన్ బిక్సల్ కొంగరి 9658 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి సొరెగ్‌పై విజయం సాధించారు. 
 
కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి 40343 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 30685 ఓట్లు పోలయ్యాయి. అయితే, ఇక్కడ నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ హత్యకుగురైన సిట్టింగ్ ఎమ్మెల్యే ఎరోస్ ఎక్కా భార్య  మీనన్ ఎక్కా కూడా పోటీ చేసింది. కానీ, ఆమెకు కేవలం 16445 ఓట్లు మాత్రమే రావడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు