రాజకీయ పార్టీపై కూడా పరువు నష్టం దావా వేయొచ్చు : కర్నాటక హైకోర్టు

వరుణ్

సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (09:21 IST)
రాజకీయ పార్టీపై కూడా పరువు నష్టం దావా వేయొచ్చని కర్నాటక హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్, బీజేపీపై వేసిన పరువు నష్టం కేసును కొట్టివేయడానికి హైకోర్టు నిరాకరించింది. భారత్ వంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలకు, ప్రజాప్రతినిధులకు తగిన రక్షణ అవసరమని న్యాయస్థానం పేర్కొంది. అందువల్ల పరువునష్టం అంత తీవ్రమైన నేరం కానప్పటికీ, దాన్ని తేలికగా తీసుకోలేమని ధర్మాసనం వెల్లడించింది. ఈ కేసులో తమ అభిప్రాయాలు, ప్రత్యేక కోర్టులో పెండింగులో ఉన్న పురువునష్టం కేసుపై ఎలాంటి ప్రభావం చూపబోవని స్పష్టం చేసింది.
 
ఈ పిటిషన్‌‍పై జస్టిస్ ఎస్ దీక్షిత్ ధర్మాసనం విచారణ జరిపింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 499, 500 ప్రకారం రాజకీయ పార్టీని వ్యక్తిగా పరిగణించలేమని బీజేపీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. బీజేపీ వాదనపై రిజ్వాన్ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐపీసీ సెక్షన్ 11లో వ్యక్తిని నిర్వచించారని, పార్టీ కూడా చాలా మంది వ్యక్తులతో కూడిన సంస్థ అని వాదించారు. 'ప్రభుత్వాలు, కంపెనీలు, కార్మిక సంఘాలకు, వారి సొంత గౌరవం ఉంటుంది. ఈ కేసులో ఫిర్యాదుదారుడి గౌరవానికి భంగం కలిందనే కారణంతో పరువునష్టం నమోదైంది. దానిపై ప్రత్యేక కోర్టు చర్యలు తీసుకోవడం సరైనదే' అని న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఇరు పక్షాల వాదనలు ఆలకించిన ధర్మాసనం బీజేపీ పిటిషన్‌ను కొట్టివేసింది. 
 
కాగా, 2019లో శాసన మండలి సభ్యుడిగా ఉన్న రిజ్వాన్ అర్షద్, ఎన్నికల సమయంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారంటూ బీజేపీ తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న రిజ్వాన్, ఆ పోస్టులతో తన వ్యక్తిత్వానికి భంగం కలుగుతోందంటూ బీజేపీ, బాలాజీ అశ్విన్ అనే వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం బీజేపీ, ఆ పార్టీ అధ్యక్షుడికి సమన్లు జారీ చేసింది. ఆ సమన్లను సవాల్ చేస్తూ బీజేపీ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు