దినకరన్‌కు జిలేబీ... ఐదుగురు ఎమ్మెల్యేల జంప్.. మిగిలిన వారూ...!

సోమవారం, 4 సెప్టెంబరు 2017 (14:20 IST)
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు అక్కడి ప్రజలు. ఇప్పటివరకు దినకరన్ పావులు కదిపి సక్సెస్ దిశగా దూసుకెళుతున్న విషయం తెలిసిందే. అయితే దినకరన్ వెంట ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కసారిగా ఆయనకు జిలేబీ తినిపించేశారు. ఆయన వర్గంలో ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలు జంప్ అయిపోయారు. మిగిలిన 17మంది వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. దీంతో దినకరన్ పరుగున చెన్నై నుంచి పుదుచ్చేరికి బయలుదేరారు.
 
అన్నాడిఎంకే లోని 19మంది ఎమ్మెల్యేలు తన వైపు తిప్పుకున్న తరువాత మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఆయన వెంట చేరారు. దీంతో మొత్తం 22కి చేరింది. ఆ ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్ళకుండా పుదుచ్చేరి లోని ఒక ప్రైవేటు హోటల్లో ఉంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉన్నారు దినకరన్. అయితే అందులో ఉన్న ఎమ్మెల్యేల్లో ఐదుగురు ఆదివారం రాత్రి కనిపించకుండా అక్కడ నుంచి చాకచక్యంగా వెళ్ళిపోయారు. మిగిలిన 17 మంది కూడా వెళ్ళిపోవడానికి సిద్థంగా ఉన్నట్లు శిబిరం నుంచి సమాచారం రావడంతో దినకరన్ హుటాహుటిన చెన్నై నుంచి పుదుచ్చేరికి బయలుదేరాడు. మిగిలిన వారినైనా బుజ్జగించి కాపాడుకోవడానికి.
 
ఇప్పటికే పళణిస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కంకణం కట్టుకున్న దినకరన్ కొంతమంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకుంటున్న విషయం తెలిసిందే. దినకరన్ వెంట ఉన్న ఎమ్మెల్యేలే ఇప్పుడు చాలా కీలకం. అలాంటిది ప్రస్తుతం ఎమ్మెల్యేలు కనిపించకుండా రహస్య ప్రాంతాలకు వెళ్ళిపోవడంతో దినకరన్‌కు ఏంచెయ్యాలో పాలుపోవడం లేదట. ఎలాగైనా వారిని తన శిబిరంలోకి తిరిగి తీసుకురావాలని దినకరన్ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటే... పళణిస్వామి మాత్రం వారు తన దగ్గరకే వస్తారన్న ధీమాలో ఉన్నారట. చూడాలి మరి.. రహస్య ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరివైపు వెళతారో..?

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు