సినిమాకు వద్దన్న భర్త.. కృష్ణా నదిలో దూకిన భార్య... ఎక్కడ?

సోమవారం, 21 ఆగస్టు 2017 (06:18 IST)
సినిమాకు తీసుకెళ్లమంటే భర్త వద్దన్నాడని ఓ భార్య క్షణికావేశానికిగురై కృష్ణానదిలో దూకింది. ఈ సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
విజయవాడకు చెందిన రాజారెడ్డి, తిరుపతమ్మ అనే దంపతులు ఉన్నారు. అయితే, తిరుపతమ్మకు సినిమా చూడాలని ఆశకలిగింది. దీంతో తనను సినిమాకు తీసుకెళ్లమని భర్తను కోరింది. దీనికి ఆయన నిరాకరించాడు. ఫలితంగా ఆవేశానికి లోనైన తిరుపతమ్మ కృష్ణా నదిలో దూకేసింది.
 
ఒక్కసారి షాక్‌కు గురైన భర్త... భార్యను కాపాడేందుకు నదిలో దూకాడు. ఇంతలో అటుగా వెళుతున్న కానిస్టేబుల్ శ్రీనివాసులు... నీళ్లలో భార్యాభర్తలిద్దరూ కొట్టుకుపోతున్నట్లు గమనించాడు. ఆ వెంటనే కానిస్టేబుల్ నదిలో దూకి వారిని ప్రాణాలతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. 
 
ఈ ఘటనకు పాల్పడిన భార్యాభర్తలిద్దరికీ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. భార్యాభర్తలిద్దరినీ ప్రాణాలకు తెగించి కాపాడిన కానిస్టేబుల్ శ్రీనివాసులును ఘనంగా సన్మానించారు.

వెబ్దునియా పై చదవండి