జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన భార్య పాయల్ అబ్దుల్లాతో విడాకులు ఇప్పించాలి కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు తాజాగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయస్థానం దంపలిద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలని సూచించింది. తమ మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలని ఆదేశించింది.
"ఈ కేసులో కౌన్సిలింగ్ ప్రక్రియ విఫలమైంది. దంపతులకు మరో అవకాశం ఇవ్వాలని భావిస్తున్నాం. ఇద్దరు కూర్చొని తమ మధ్య వివాదానికి కారణమైన అంశాలపై శాంతియుతంగా చర్చించుకోవాలి. మూడు వారాల్లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలి" అని జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను మే 7వ తేదీకి వాయిదావేసింది.
కాగా, ఒమర్ అబ్దుల్లా, ఆయన భార్య గత కొన్నేళ్ళుగా విడివిడిగా జీవిస్తున్నారు. ఆమెతో తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ 2016లో ఫ్యామిలీ కోర్టును ఒమర్ ఆశ్రయించారు. కానీ, న్యాయస్థానం దానిని తిరస్కరించింది. దీన్ని సవాల్ చేస్తూ 2023లో ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ కూడా ఒమర్కు నిరాశే మిగిలింది. దిగువకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీంతో గతేడాది సుప్రీంకోర్టు ఆశ్రయించారు. తాజాగా దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం దంపతులకు ఈ సూచనలు చేసింది.