ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పివేశాక బయటపడిన నోట్ల కట్టలు!!

ఠాగూర్

శుక్రవారం, 21 మార్చి 2025 (14:26 IST)
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆయన ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపకసిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేసింది. ఆ తర్వాత ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఫైర్ సిబ్బంది, స్థానిక పోలీసులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో కరెన్సీ నోట్ల కట్టలు వెలుగు చూశాయి. ఈ విషయం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా దృష్టికి వెళ్లడంతో ఆయన తీవ్రంగా స్పందించి, హైకోర్టు జడ్జిపై బదిలీ చేశారు. 
 
ఆ జస్టిన్ పేరు యశ్వంత్ వర్మ. ఈ అగ్నిప్రమాదం సంభవించినపుడు ఆయన ఇంట్లో లేరు. ప్రమాదం గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మంటలు ఆర్పివేసిన తర్వాత అగ్నిమాపక సిబ్బందికి ఒక గదిలో భారీగా నోట్ల కట్టలు కనిపించాయి. దీనిని అధికారులు ఐటీ లెక్కల్లో చూపించని డబ్బుగా గుర్తించారు. 
 
స్థానిక పోలీసులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా దీనిపై తీవ్రంగా స్పందించారు. వెంటనే కొలీజియం సమావేశం ఏర్పాటుచేశారు. జస్టిస్ వర్మను వెంటనే బదిలీ చేయాలని కొలీజియం ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. గత 2021 అక్టోబరు నెలలో ఆయన ఆలహాబాద్ హైకోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇపుడు మళ్లీ అలహాబాద్ హైకోర్టుకే వెళ్లారు. 
 
అయితే, కొలీజియంలోని కొందరు సభ్యులు ఈ ఘటనను బదిలీతో వదిలేస్తే న్యాయవ్యవస్థ ప్రతిష్ట మసకబారుతుందని అభిప్రాయపడ్డారు. జస్టిస్ వర్మను రాజీనామా చేయమని అడగాలని అందుకు ఆయన నిరాకరిస్తే పార్లమెంట్ ద్వారా తొలగించేందుకు సిఫార్సు చేయాలని కొందరు అభిప్రాయపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు