94 యేళ్ళ జీవితం.. 80 యేళ్ల రాజకీయం.. 60 ఏళ్ళ శాసనసభ సభ్యత్వం...

బుధవారం, 8 ఆగస్టు 2018 (10:17 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, తమిళ సూర్యుడు, డీఎంకే అధినేత కరుణానిధి అస్తమించారు. ఆయన వయసు 94 యేళ్లు. 94 యేళ్ల జీవితంలో 80 యేళ్లు రాజకీయనేతగా ఉన్నారు. ఇందులో 60 యేళ్లు ప్రజా ప్రతినిధిగా (శాసనసభ్యుడు) కొనసాగారు.
 
1991లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే సునామీ సృష్టించింది. ఎంతగానంటే.. డీఎంకేకు ఆ ఎన్నికల్లో ఒకే ఒక సీటు లభించింది. అది కరుణానిధి గెలిచిన చెన్నై హార్బర్‌ నియోజకవర్గం. అప్పుడేకాదు, 60 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో ఓటమి చాయలే లేవు. మొత్తం 13 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 
 
తమిళనాడులోని వివిధ నియోజకవర్గాల నుంచి కరుణానిధి 13 ఎన్నికల్లో పోటీ చేసి ప్రతీసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1957 నుంచి 2016 వరకు పోటీ చేసిన అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధించారు. తమిళనాడు చరిత్రలో ఇన్నిమార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన వారు మరొకరు లేరు. 1991లో జయలలిత ప్రభంజనంలోనూ ఆయన జయకేతనం ఎగురవేశారు. డీఎంకే నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యేగా రికార్డు సాధించారు. 
 
ఇకపోతే, 1969లో డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై మరణించిన అనంతరం జరిగిన వారసత్వ పోరులో కలైంజ్ఞర్‌ పైచేయి సాధించి అటు.. సీఎంగా, ఇటు పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి 50 ఏళ్ల పాటు నిరాటంకంగా అధ్యక్ష పదవిలో ఆయనే కొనసాగారు.
 
18 ఏళ్లు సీఎంగా..
1969 ఫిబ్రవరి 10 నుంచి 1971 జనవరి 4
1971 మార్చి 15 నుంచి 1976 జనవరి 31
1989 జనవరి 27 నుంచి 1991 జనవరి 30
1996 మే 13 - 2001 మే 13
2006 మే 13 - 2011 మే 15 మధ్య సీఎంగా పనిచేశారు.
 
తమిళనాట ప్రజాదరణ పొందిన సీఎంలలో అన్నాదురై 700 రోజులు, ఎంజీఆర్‌ 3,624 రోజులు, జయలలిత 5,239 రోజులు, కరుణానిధి 6,809 రోజులు (18 ఏళ్ల 6 నెలలు) సీఎం పదవిలో ఉన్నారు. తమిళనాడుకు మూడో ముఖ్యమంత్రి ఆయనే. ఇక.. కరుణానిధి ప్రభుత్వం రెండుమార్లు బర్తరఫ్‌ అయ్యింది. 1976 జనవరిలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో ఒకసారి, 1991లోనూ కాంగ్రెస్‌ హయాంలోనే రెండోసారి ఆయన ప్రభుత్వాన్ని రాజకీయ దురుద్దేశ్యంతో రద్దు చేయడం జరిగింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు