ఎలక్ట్రోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధం.. క్విడ్ ప్రో కో కు దారితీయొచ్చు.. సుప్రీంకోర్టు

ఠాగూర్

గురువారం, 15 ఫిబ్రవరి 2024 (12:38 IST)
రాజకీయ పార్టీలు సేకరించే విరాళాలలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్ట్రోరల్ బాండ్స్ విధానం రాజ్యాంగ్ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది క్విడ్ ప్రో కో కు దారితీయొచ్చని తెలిపింది. నల్లధనం నిర్మూలన పేరుతో తీసుకొచ్చిన ఈ విధానంలో పారదర్శకత లోపించిందని, ముఖ్యంగా భారత రిజర్వు బ్యాంకు పరిధి నుంచి తప్పించడం సరికాదని, ఇది రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా అభివర్ణించింది. ముఖ్యంగా, ఎన్నికల వ్యవస్థలో రాజకీయ పార్టీలు కూడా ఓ భాగమేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. 
 
కాగా, రాజకీయ పార్టీల నిధుల సమీకరణకు ఉద్దేశించిన ఎన్నికల బాండ్ల పథకం చట్టబద్ధతను సవాలు చేస్తూ ఏడీఆర్, సీపీఎం సహా మరికొందరు పిటిషనర్లు సుప్రీంను ఆశ్రయించారు. 2024 సార్వత్రిక ఎన్నికలలోపే ఈ పథకంపై సమగ్ర విచారణ జరపాలని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అప్పట్లో సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీంతో, గతేడాది అక్టోబరు నెల 31వ తేదీన ఈ పిటిషన్లపై వాదనలు ప్రారంభమయ్యాయి. నవంబరు రెండో తేదీనాటికి విచారణలు పూర్తి చేసి కోర్టు తన తీర్పును రిజర్వు చేయగా, గురువారం ఈ తీర్పును వెలువరించింది. 
 
కాగా, రాజకీయ పార్టీలు పారదర్శకంగా నిధులు సమీకరించేందుకు వీలుగా 2018 జనవరి 2న ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా పార్టీలకు విరాళాలు ఇవ్వాలనుకున్న వారు ఎన్నికల బాండ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రూ.1000 నుంచి రూ.కోటి వరకూ వివిధ మొత్తాలకు ఎన్నికల బాండ్స్ జారీ చేస్తారు. ఇవి వివిధ ఎస్బీఐ బ్రాంచీల్లో కొనుగోలు చేయొచ్చు. భారత పౌరులు, భారత్‌లో స్థాపించిన లేదా ఇన్‌ కార్పొరేట్ అయిన కంపెనీలు ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు అందించవచ్చు. 
 
ఈ పథకంలో దాతల వివరాలు గోప్యంగా ఉంచుతారు. ప్రజలకు, పార్టీలకు కూడా ఈ దాతల వివరాలు వెల్లడించరు. అయితే, ఆడిటింగ్ అవసరాల కోసం ప్రభుత్వం, సంబంధిత బ్యాంకులు దాతల వివరాలు సేకరిస్తాయి. ఎన్నికల్లో కనీసం ఒక శాతం ఓట్లు పొందిన పార్టీలే ఈ పథకానికి అర్హులు. అధీకృత బ్యాంకుల్లోనే రాజకీయ పార్టీలు ఈ బాండ్లను క్యాష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ తీర్పును వెలువరించిన ధర్మాసనంలో సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలు ఉన్నారు. అయితే, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలు రెండు వేర్వేరు తీర్పులను వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు