పొగాకు రంగంలో కాంట్రాక్ట్‌ వ్యవసాయాన్ని పరిచయం చేయాలనే ప్రభుత్వ ప్రణాళికలను వ్యతిరేకిస్తున్న రైతులు

మంగళవారం, 2 నవంబరు 2021 (17:29 IST)
ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాలకు చెందిన పొగాకు రైతులు- రైతు నాయకులతో కూడిన వర్జీనియా టొబాకో గ్రోయర్స్‌ అసోసియేషన్‌, ఫెడరేషన్‌ ఆఫ్‌ కర్నాటక వర్జీనియా టొబాకో గ్రోయర్స్‌ అసొసియేషన్‌, కొండపి టొబాకో గ్రోయర్స్‌ అసొసియేషన్‌, కలిగిరి ఎఫ్‌సీవీ టొబాకో గ్రోయర్స్‌ అసొసియేషన్‌ మొదలైనవి నిర్ద్వందంగా పొగాకు రంగంలో కాంట్రాక్ట్‌ వ్యవసాయ ఆలోచనను వ్యతిరేకించాయి. తమ జీవనోపాధిపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని వారు ఆందోళన వెలిబుచ్చుతూ ఫ్లూ క్యూర్డ్‌ వర్జీనియా (ఎఫ్‌సీవీ) రైతులకు తీవ్ర నష్టం కలిగిందని, పొగాకు రంగంలో కాంట్రాక్ట్‌ వ్యవసాయం తీసుకురావడం వల్ల ఈ నష్టాలు మరింతగా పెరుగుతాయని వెల్లడించారు.
 
భారతీయ పొగాకు రంగంలో కాంట్రాక్ట్‌ వ్యవసాయం పరిచయం చేయాలనే ప్రభుత్వ ప్రణాళికలను వ్యతిరేకించిన గద్దె శేషగిరిరావు, ఎక్స్‌ వైస్‌ ఛైర్మన్‌, టొబాకో బోర్డ్‌ మాట్లాడుతూ, ‘‘మా పారదర్శక వేలం వ్యవస్థకు ఈ కాంట్రాక్ట్‌ వ్యవసాయం సాటిరాదు. నిజానికి వేలం వ్యవస్థతో భారతీయ రైతులు తగిన మద్దతు ధర పొందడంతో పాటుగా ధరల హెచ్చుతగ్గుల పరంగా కూడా అతి తక్కువ ప్రభావానికి గురవుతున్నారు. కాంట్రాక్ట్‌ వ్యవసాయంతో సుదీర్ఘకాలంలో ఎదురయ్యే పర్యవసానాలను పరిశీలించాల్సి ఉంది’’ అని అన్నారు.
 
ప్రస్తుత వేలం వ్యవస్థను ప్రశంసించిన శ్రీ జవార్‌ గౌడ, ఫెడరేషన్‌ ఆఫ్‌ కర్నాటక వర్జీనియా టొబాకో గ్రోయర్స్‌ అసొసియేషన్‌ మాట్లాడుతూ, ‘‘ఎఫ్‌సీవీ కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ మమ్మల్ని 1984 ముందు నాటికి తీసుకువెళ్లనుంది. మనం ఖచ్చితంగా ప్రస్తుత వేలం వ్యవస్ధను కాపాడాల్సి ఉంది. తమ అమ్మకాల పునరుద్ధరణ కోసం కుట్రలు పన్నుతున్న విదేశీ పొగాకు బహుళజాతి సంస్థల ప్రయత్నాలను తిప్పికొట్టాలి’’ అని అన్నారు.
 
ఈ కష్టకాలంలో రైతులకు ప్రభుత్వం మద్దతునందించాల్సిన ఆవశ్యకత గురించి శ్రీ ఎం సుబ్బారెడ్డి, వర్జీనియా టొబాకో గ్రోయర్స్‌ అసోసియేషన్‌ మాట్లాడుతూ ‘‘కోవిడ్‌ 19 కారణంగా ఎఫ్‌సీవీ పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారికి మద్దతునందించాల్సిన సమయమిది’’ అని అన్నారు. శ్రీ మురళి బాబు, జనరల్‌ సెక్రటరీ, కొండపి టొబాకో గ్రోయర్స్‌ అసోసియేషన్‌ మాట్లాడుతూ, ప్రభుత్వ చర్యల పట్ల పోగాకు నియంత్రణ బోర్డు నిశ్శబ్దంగా ఉండటంతో రైతు సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తుందన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు