పశువుల యజమానికి ఐదు చెప్పు దెబ్బలు.. గ్రామ సర్పంచ్ నిర్ణయం

శుక్రవారం, 21 జులై 2023 (17:13 IST)
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గ్రామ పంచాయతీ తీసుకున్న నిర్ణయం ఇపుడు వివాదాస్పదమైంది. ఈ గ్రామంలోని పశువులు ఆరుబయట స్వేచ్ఛగా తిరేగందుకు వీలు లేదని నిబంధన విధించింది. ఇది వివాదాస్పదమైంది. దీనిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు, వెంటనే ఆ నిబంధనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, పంచాయతీ సిబ్బంది మాత్రం గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కొత్త నిబంధన గురించి వివరిస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని షాహ్‌దోల్‌ జిల్లా నగ్నాదుయ్‌ గ్రామస్థులు తమ పశువులను వీధుల్లో స్వేచ్ఛగా తిరగనివ్వకూడదని ఆ గ్రామ సర్పంచ్‌ కొత్త నిబంధనను తీసుకొచ్చారు. పశువుల నిర్వహణలో గ్రామస్థులు బాధ్యతాయుతంగా వ్యవహరించడంతోపాటు, రోడ్లపై వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పంచాయతీ సిబ్బంది తెలిపారు. 
 
ఒకవేళ ఎవరైనా తమ పశువులను గ్రామంలోని వీధుల్లో తిరిగేందుకు విడిచిపెడితే.. వాటి యజమానికి ఐదు చెప్పు దెబ్బలతోపాటు, రూ.500 జరిమానా విధిస్తామని చాటింపు వేయించారు. ఈ మేరకు గ్రామంలో కొత్త నిబంధనపై ప్రకటన చేయించారు. అయితే, ఈ ప్రకటన విన్న గ్రామస్థులు మాత్రం ఇదేం వింత నిబంధన అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వాధికారులు జోక్యం చేసుకొని.. నిబంధనను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు