ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసు దర్యాప్తులో భాగంగా తమ ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకున్న నగలు తుప్పు పట్టిపోతున్నాయని, వాటిని తిరిగి మాకిచ్చేయాలని కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన కోర్టును ఆశ్రయించారు.
తమ ఇంటి నుంచి 53 కేజీల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారని, ఇపుడు అవన్నీ తుప్పుపట్టిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ నగలతో పాటు తమ వద్ద సీజ్ చేసిన నగదు, రూ.5 కోట్ల విలువైన బాండ్లను విడుదల చేయాలంటూ గాలి జనార్ధన్ రెడ్డి, ఆయన కుమార్తె జి.బ్రాహ్మణి, కుమారుడు జి. కిరీటి రెడ్డి కోర్టును ఆశ్రయించారు. అయితే, వీరి పిటిషన్లను పరిశీలించిన తెలంగాణ హైకోర్టు వాటిని కొట్టివేసింది.
బంగారు నగలు తుప్పుపట్టిపోతాయని, వాటి విలువ తగ్గుతుందన్న గాలి అభ్యర్థనను తిరస్కరించింది. ఓఎంసీ కేసు పూర్తయ్యాకే వాటిపై హక్కులు తేల్చుకోవాలని స్పష్టం చేసింది. అక్రమ మైనింగ్ ద్వారా రూ.884.13 కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారని సీబీఐ కేసు నమోదు చేసి, నేరపూరిత సొమ్ముతో కొనుగోలు చేసిన నగలపై ఈడీ కూడా హక్కులు కోరుతోందని, అందువల్ల ఈ దశలో సీజ్ చేసిన వాటిని అప్పగించాలని ఉత్తర్వులు ఇవ్వలేమంది. ఓఎంసీ కేసు విచారణ పూర్తయ్యాకే నగలను, సొమ్ములవను తీసుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.