భారత్‌లో సిక్కులకు రక్షణ లేదన్న రాహుల్.. మండిపడిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్

ఠాగూర్

బుధవారం, 11 సెప్టెంబరు 2024 (09:11 IST)
అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రులు మండిపడుతున్నారు. భారత్‌లో సిక్కులకు రక్షణ లేకుండా పోయిందని, కనీసం తలపాగా కూడా ధరించలేకపోతున్నారంటూ వ్యాఖ్యానించారు. అమెరికా వర్జీనియాలో రాహుల్ మాట్లాడుతూ.. ఇండియాలో సిక్కులు తలపాగా ధరించడానికి అనుమతిస్తున్నారా? అని ప్రశ్నించారు. సిక్కులు గురుద్వారాలకు వెళ్లగలుగుతున్నారా? అన్నారు. 
 
ఈ వ్యాఖ్యలపై సిక్ వర్గానికి చెందిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఘాటుగా స్పందించారు. సిక్కుల పరిరక్షణకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంతో చేస్తోందన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. విదేశీ పర్యటనల్లో రాహుల్ గాంధీ ప్రమాదకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
 
తలపాగా (టర్బన్) ధరించాలంటేనే భారత్‌లోని సిక్కులు భయపడుతున్నారని రాహుల్ అంటున్నారని... తాను 60 ఏళ్లుగా టర్బన్ ధరిస్తున్నానని హర్దీప్ సింగ్ అన్నారు. సిక్కుల సంరక్షణకు మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని రక్షణ చర్యలను చేపడుతోందని చెప్పారు. మనకు స్వాతంత్ర్యం వచ్చిన 1947 తర్వాత మన దేశంలో ఇప్పుడున్నంత సురక్షితంగా సిక్కులు మరెప్పుడూ లేరని అన్నారు. 
 
రాహుల్ గాంధీ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే సిక్కులు భయాందోళనలతో బతికారంటూ కౌంటర్ ఇచ్చారు. 1984లో సిక్కులను ఊచకోత కోశారని, 3 వేల మందిని చంపేశారని హర్దీప్ సింగ్ అన్నారు. ఇళ్లల్లో ఉన్న సిక్కులను బయటకు లాక్కొచ్చి వారిని సజీవ దహనం చేశారని గుర్తు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు