శివాజీ విగ్రహం కూలింది.. తలవంచి క్షమాపణలు చెపుతున్నా : ప్రధాని మోడీ

ఠాగూర్

శుక్రవారం, 30 ఆగస్టు 2024 (16:57 IST)
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. తలవంచి క్షమాపణలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. ఈ విగ్రహం కూలిన ఘటనపై విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. తొమ్మిది నెలలు కూడా పూర్తికాకుండానే విగ్రహం కూలిపోవడం పట్ల ప్రతిపక్షాలు మండిపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రచారం మీద ఉన్న దృష్టి, నాణ్యత మీద లేదని దుయ్యబట్టాయి. ఈ ఘటనపై తాజాగా ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పారు. 
 
'నేను ఇక్కడ దిగిన వెంటనే.. విగ్రహం కూలడంపై శివాజీకి క్షమాపణలు చెప్పాను. ఈ ఘటన వల్ల బాధకు గురైన వారికి నా క్షమాపణలు తెలియజేస్తున్నాను' అని వెల్లడించారు. 'ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను తమ దైవంగా భావించేవారు ఈ ఘటనతో తీవ్ర వేదనకు గురయ్యారు. నా తలవంచి వారికి క్షమాపణలు చెబుతున్నా. మనకు ఈ దైవం కంటే గొప్పది ఏమీ లేదు' అని మోడీ వ్యాఖ్యానించారు. 
 
ఆయన శుక్రవారం మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో పర్యటిస్తున్నారు. ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కొద్దిరోజుల క్రితం కుప్పకూలిపోయింది. 35 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని గతేడాది డిసెంబరు 4న నౌకాదళ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోడీ ఆవిష్కరించారు. రాష్ట్రంలో కురిసిన వర్షాల కారణంగానే విగ్రహం కూలినట్లు భావిస్తున్నామని, అసలు కారణాన్ని నిపుణులు త్వరలోనే వెల్లడిస్తారని అధికారులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు