శవాల దిబ్బగా ఇడుక్కి : 52కు పెరిగిన మృతుల సంఖ్య

మంగళవారం, 11 ఆగస్టు 2020 (17:52 IST)
కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి ఇపుడు శవాల దిబ్బగా మారిపోయింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో కొండ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా, ఇడుక్కిలో రాజమాల కొండచరియల్లో మృతదేహాలు బయట పడుతూనే ఉన్నాయి. 
 
మంగళవారం కూడా మరో మూడు మృతదేహాలను ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకోగా మరణించిన వారి సంఖ్య మంగళవారం 52కు పెరిగింది. మొత్తం మరణాల సంఖ్యను జిల్లా కలెక్టర్ మీడియాకు ధృవీకరించారు. 
 
మరోవైపు, రెండు ఎన్‌డీఆర్‌ఎఫ్ జట్లు, ఇడుక్కి ఫైర్ అండ్ రెస్క్యూ టీం, కొట్టాయం, తిరువనంతపురం నుంచి ఒక్కో ప్రత్యేక శిక్షణ పొందిన బృందాలు ఇడుక్కి రాజమాలాలో సహాయక చర్యలు చేపడుతున్నాయని జిల్లా సమాచార కార్యాలయం ఆదివారం తెలిపింది. 
 
ఇదిలావుండగా, మృతుల బంధువులకు కేరళ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ శుక్రవారం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేసి, జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి మరణించిన వారి బంధువులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. ఈ మొత్తాన్ని మృతుల కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు