మీరు ఉరేసినా సరే.. నన్ను ఉరేసుకోమన్నా సరే : మమతా బెనర్జీ మేనల్లుడి ఛాలెంజ్

శుక్రవారం, 8 జనవరి 2021 (12:38 IST)
వెస్ట్ బెంగాల్‌లో రాష్ట్ర రాజకీయం రోజుకో విధంగా మారిపోతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఒక్కక్కరూ మెల్లగా బీజేపీలోకి జారుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కాషాయం తీర్థం పుచ్చుకున్నారు. త్వరలో జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో విజయంసాధించడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. దీంతో టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. 
 
ఈ క్రమంలో టీఎంసీ నేతలను తమ వైపునకు ఆకర్షించేందుకు ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. ఇప్పటికే పలువురు నేతలు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మమతను ఊపిరి సలపకుండా చేస్తున్న బీజేపీ తాజాగా, ఆమె మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీని టార్గెట్ చేసింది. ఆయనను దోపిడీదారు అల్లుడంటూ ఆరోపణలు గుప్పించింది. తనపై బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై అభిషేక్ తీవ్రస్థాయిలో స్పందించారు.
 
దక్షిణ దినాపూర్‌లో గురువారం నిర్వహించిన ఓ ర్యాలీలో పాల్గొన్న అభిషేక్ మాట్లాడుతూ.. దోపిడీదారు అల్లుడిగా తనను చిత్రీకరిస్తున్న బీజేపీ నేతలు ఆ ఆరోపణలను నిరూపిస్తే తాను ఉరివేసుకుంటానని అన్నారు. తనపైకి ఈడీ, సీబీఐలను ఉసిగొల్పి విచారించాల్సిన అవసరం కూడా లేదని, ఆ ఆరోపణలను వారు నిరూపించినా తనను ఉరితీయవచ్చన్నారు. 
 
లేదంటే తానే ఉరి వేసుకుంటానని సవాలు విసిరారు. బీజేపీ నేత కైలాశ్ విజయవర్గీయ బెంగాల్ వ్యక్తి కాదని, ఆయన కుమారుడు ఓ గూండా అని ఆరోపించారు. బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కూడా గూండానే అని ఆరోపించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు