పార్లమెంటును తప్పుదారి పట్టించి విభజన బిల్లును ఆమోదింపజేయడంలో తాను ప్రధాన పాత్ర వహించారని గత కొంతకాలంగా తనపై వస్తున్న ఖండన మండనలను కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి తోసిపుచ్చారు. ఈ అంశానికి సంబంధించి ఒక పుస్తకమే రాసిపడేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ వాదనలను జైపాల్ ఖండించారు. పైగా ఏదైనా కీలక బిల్లులు ఆమోదించేటప్పుడు తలుపులు వేయడం పార్లమెంటులో ఆనవాయితీ అని దానికి అంత ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదని చెప్పారు. ఆరోజు పార్లమెంటులో జరిగిన ప్రతి చర్చా రికార్డయి ఉందని, పార్లమెంటులోని టీవీలో కూడా అది రికార్డయి ఉందని కానీ ఆ టీవీ పుటేజ్ని బయటకు ప్రసారం చేయకపోవడం వాస్తవమేనని జైపాల్ స్పష్టం చేశారు. లోక్సభలో విభజన బిల్లుపై చర్చ, ఓటింగ్ జరిగినప్పుడు ప్రతిమాటా రికార్డయిందని, టీవీలో కూడా రికార్డు చేశారు కానీ దాన్ని టీవీలో చూపలేదని వివరణ ఇచ్చారు. ఈ అంశంపై జైపాల్ అబిప్రాయాలను ఆయన మాటల్లోనే విందాం.
"తెలంగాణ కంటే సీమాంద్రలోనే నాకు మిత్రులు ఎక్కువ. ‘తెలం గాణకు మద్దతిచ్చావు సరే. ఒప్పుకుంటాం. కానీ ప్రొసీజర్కి బిన్నంగా నీవు చేశావు’ అంటారు వారు. ఈ విమర్శ ఉంది. సమాధానం చెప్ప వలసిన బాధ్యత కూడా నాపై ఉంది. నేను చెప్పేది ఒకే విషయం. మెజారిటీని కాదనే శక్తి మైనారిటీకి ఎలా ఉంటుంది? విభజనకు అనుకూలంగా మెజారిటీ లేదు అనే సందేహం ఎక్కడైనా ఉందా? పైగా తలుపులు మూసేసారంటున్నారు. మీతరఫున నేను దీనిపై క్లారిటీ ఇవ్వాలి. ఎప్పుడు కీలకమైన బిల్లు ప్రవేశపెట్టినా డోర్లు బంద్ చేస్తారు. పాత్రికేయులుగా మీకూ తెలిసిందే. కానీ లైట్లు, టీవీ ఆఫ్ చేశారన్న విషయం నాకు తెలీనే తెలీదు. నేను లోక్ సభలో ఉన్నాను. స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. కానీ అది రికార్డయింది. ఆ సమ యంలో మాట్లాడిన ప్రతి మాటా రికార్డయింది. టీవీలోనూ రికార్డయింది కానీ టీవీలో చూపలేదంతే." అని జైపాల్ నాటి ఘటనలపై వ్యాఖ్యానించారు.