ప్రాణాలతో వుండగానే.. మార్చురీకి తరలించారు.. కానీ?

మంగళవారం, 9 జనవరి 2018 (14:35 IST)
రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రాణాలతో ఉన్న యువకుడు అందరూ చనిపోయారనుకున్నారు. అంతే మార్చురీకి కూడా తరలించారు. అయితే ఏడు గంటల తర్వాత పోస్టుమార్టం చేసేందుకు ప్రయత్నిస్తున్న సిబ్బందికి షాక్ తగిలింది. యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన కర్ణాటక హుబ్బళ్లి కిమ్స్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. హుబ్బళిలోని ఆనంద నగర్‌లో ప్రవీణ్ మూళే (23) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో జరిగిన కారు ప్రమాదంలో ప్రవీణ్‌కు తీవ్ర గాయాలైనాయి. రాత్రి ఎనిమిది గంటల సమయంలో కుటుంబ సభ్యులు ప్రవీణ్‌ను హుబ్బళిలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. 
 
సోమవారం వేకువ జామున మూడు గంటల సమయంలో ప్రవీణ్ మరణించాడని పోస్టుమార్టం గదికి తరలించారు. సోమవారం ఉదయం పది గంటల సమయంలో పోస్టు మార్టం చేసేందుకు వైద్యులు వెళ్లిన సమయంలో ప్రవీణ్ ప్రాణాలతో వున్న సంగతి తెలిసింది. వెంటనే కుటుంబ సభ్యులు హుబ్బళిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే 20 నిమిషాల క్రితం ప్రవీణ్ మరణించాడని ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు.
 
హుబ్బళి కిమ్స్ వైద్యుల నిర్లక్ష్యానికి అమాయకుడి ప్రాణాలు పోయాయని ప్రవీణ్ కుటుంబ సభ్యులు, అతని స్నేహితులు కిమ్స్ ఆసుపత్రి ముందు ఆందోళన చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు