తమ్ముడు చోరీ చేశాడనీ అవమానభారంతో ఇద్దరు పిల్లలతో బావిలో దూకిన అక్క!!

ఠాగూర్

బుధవారం, 16 ఏప్రియల్ 2025 (08:55 IST)
కర్నాటక రాష్ట్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తన భర్త మొబైల్ ఫోనును తమ్ముడు చోరీ చేశాడు. దీనిపై భార్యను భర్త నిలదీశాడు. బావ ఫోనును తమ్ముడు చోరీ చేయడాన్ని జీర్ణించుకోలేని అక్క తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన కర్నాటక రాష్ట్రంలోని చామరాజ నగర జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చామరాజ నగర జిల్లాలోని హనూరు తాలూకా కాడుగోళ గ్రామానికి చెందిన సుశీల (30)ను చూసేందుకు తమ్ముడు మాదేవ ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి వెళుతూ బావ మహేశ్ ఫోనుతో పాటు నగదును తీసుకుని వెళ్లాడు. దీన్ని గుర్తించిన మహేశ్... బావమరిదిని దుర్భాషలాడాడు. ఇంటికొచ్చి ఇలాంటి పనులేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది వారిద్దరి మధ్య వాగ్వివాదానికి కారణమైంది. 
 
ఆ తర్వాత తన భార్య సుశీలతోనూ భర్త మహేశ్ గొడవడ్డాడు. దీంతో ఆమె తమ్ముడు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు తమ్ముడు చేసిన పనికి అవమానభారంతో రగిలిపోయింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తన ఇద్దరు పిల్లలను తీసుకుని బయటకు వెళ్లిపోయింది. అయితే, తనపై అలిగి పుట్టింటికి వెళ్లివుంటుందని భర్త భావించాడు. 
 
అయితే, సోమవారం గ్రామంలోని ఓ బావివద్ద సుశీల చెప్పులు, తాళిబొట్టు, ఇతర వస్తువులను గ్రామస్థులు గుర్తించడంతో  ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బావిలో గాలించారు. సుశీల, పిల్లలు దివ్య (11), చంద్రు (8) మృతదేహాలను వెలికి తీశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు