కరెన్సీ నోట్ల రద్దుపై ఇలా జరుగుతుందని ఊహించలేదు : ప్రధాని నరేంద్ర మోడీ

గురువారం, 22 డిశెంబరు 2016 (15:47 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పశ్చాత్తాపం చెందారు. దేశంలో పెద్ద విలువ కలిగిన నోట్ల రద్దు తర్వాత ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమువుతాయని ఊహించలేదని ఆయన చెప్పారు. తన సొంత నియోజకవర్గమైన వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 
 
దేశంలోని రాజకీయ పార్టీల నేతలు అవినీతిని సమర్థిస్తారని తాను ఎప్పుడూ అనుకోలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశంలో పెద్ద నోట్ల రద్దు అనేది భారీ ప్రక్షాళన కార్యక్రమమన్నారు. ప్రజలు దీనికి మద్దతిస్తున్నారని చెప్పారు. కానీ ప్రతిపక్షాలు అవినీతివైపు ఉన్నాయని ఆరోపించారు. అవినీతిపరులకు మద్దతుగా కొందరు రాజకీయ నేతలు దృఢంగా నిలబడతారని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు. 
 
రూ.500, రూ.1,000 నోట్ల రద్దు అనంతరం డబ్బు కోసం బ్యాంకులు, ఏటీఎంల వద్ద ఎక్కువసేపు క్యూలలో నిలుచున్నందుకు ప్రజలను ప్రశంసించారు. తనకు 125 కోట్ల భారతీయులపై నమ్మకం ఉందన్నారు. భారతీయులు నిస్వార్థపరులని, వారి ఆశీర్వాదాలు తనకు దేవుడిచ్చే దీవెనలతో సమానమని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి