జమ్మూ: పహల్గామ్ దాడి జరిగి మూడు రోజులు కావస్తోంది. పర్యాటకులపై దాడి చేసిన వారి కోసం సైన్యం గాలిస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ కాశ్మీర్లోని త్రాల్, బిజ్బెహారా ప్రాంతాలలో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదుల నివాసాలను శుక్రవారం కాశ్మీర్లోని భద్రతా అధికారులు ధ్వంసం చేశారు. అయితే సైన్యం కదలికలను కనిపెట్టిన ఉగ్రవాదులు అక్కడ నుంచి పలాయనం చిత్తగించారు. ఉగ్రవాదులు ఈ ఇళ్లలో ఉంచిన పేలుడు పదార్థాలు సోదాల సమయంలో వాటంతట అవే పేలిపోయాయని భద్రతా అధికారులు చెబుతున్నారు.
బైసరన్ పహల్గామ్ సంఘటనలో వీరి పాత్ర వున్నట్లు వెలుగులోకి వచ్చిన తర్వాత, పుల్వామా జిల్లాలోని త్రాల్లోని ఆసిఫ్ షేక్, బిజ్బెరా అనంత్నాగ్లోని ఆదిల్ థోకర్ ఇళ్ళు బాంబు పేలుళ్ల ద్వారా నేలమట్టమయ్యాయని అధికారిక వర్గాలు తెలిపాయి. గత మంగళవారం బైసరన్ పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో పహల్గామ్ స్థానికుడు, 25 మంది పర్యాటకులు, నేపాల్ నుండి ఒకరు సహా కనీసం 26 మంది మరణించారు.
శుక్రవారం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ సమయంలో, భద్రతా దళాలు కొన్ని అనుమానాస్పద వస్తువులను గుర్తించాయని వర్గాలు తెలిపాయి. అనుమానస్పద ఇంటి తలుపును తెరిచాక ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన భద్రతా దళాలు వెంటనే భద్రతను నిర్ధారించడానికి వెనక్కి తగ్గాయని వర్గాలు తెలిపాయి. అయితే వారలా వెనక్కి తిరిగిన కొద్దిసేపటికే శక్తివంతమైన పేలుడు సంభవించింది, దీని వలన ఇంటికి తీవ్ర నష్టం వాటిల్లింది సైన్యానికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఉగ్రవాదులు అక్కడ కొంత పేలుడు పదార్థం వుంచినట్లు తెలుస్తోంది. తదుపరి దర్యాప్తు జరుగుతోంది.