తాగుబోతులకు పండగే ... రెడ్ జోన్లలో మద్యం విక్రయాలు..

ఆదివారం, 3 మే 2020 (09:28 IST)
ఇకపై తాగుబోతుల కరువు తీరనుంది. గత 45 రోజులుగా మద్యం లేక తల్లడిల్లిపోతున్న మద్యంబాబులకు.. సోమవారం నుంచి మద్యం అందుబాటులోకిరానుంది. గ్రీన్, ఆరెంజ్ జోన్లతో పాటు రెడ్ జోన్లలో కూడా మద్యం విక్రయాలు జరుపుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే, రెడ్ జోన్లలో మాత్రం కఠిన ఆంక్షలతో మద్యం విక్రయాలు జరుగనున్నాయి. 
 
మే 3వ తేదీతో ముగియనున్న రెండో దశ లాక్‌డౌను మరో 14 రోజులపాటు కేంద్రం పొడగించింది. అంటే మే 17వ తేదీ వరకు ఇది అమల్లో వుండనుంది. అయితే, అనేక రకాలైన పనులు చేసుకునేందుకు, షాపులు తెరిచేందుకు పాక్షికంగా అనుమతులు ఇచ్చింది. ఇలాంటి వాటిలో మద్యం దుకాణాలు కూడా ఉన్నాయి. 
 
రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్లన్నింటిలో మద్యం విక్రయాలు కొనసాగించ వచ్చని స్పష్టంచేస్తూ, రెడ్ జోన్ల విషయంలో పరిమితులను విధించింది. కేవలం మద్యం విక్రయాలు మాత్రమే సాగాలని, పర్మిట్ రూంల నిర్వహణకు అనుమతి లేదని తేల్చిచెప్పింది. 
 
అలాగే, మాల్స్‌లో ఉండే మద్యం రిటైల్ దుకాణాలకు అనుమతి లేదని తెలిపింది. దుకాణాల మధ్య కనీసం ఆరు అడుగుల భౌతిక దూరం తప్పనిసరని, ఏ దుకాణం వద్ద కూడా అయిదుగురికి మించి ఉండరాదని క్లారిటీ ఇచ్చింది. మార్కెట్ ఏరియాల్లో ఉన్న మద్యం దుకాణాలు తెరిచేందుకు వీల్లేదని వెల్లడించింది. 

మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం కూడా మద్యం అమ్మకాలపై ఆదివారం కీలక నిర్ణయం తీసుకోనుంది. కేంద్రం సూచించిన విధంగా సోమవారం నుంచి షాపులను తెరచుకునేందుకు అనుమతించాలా? వద్దా? అన్న విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గ సహచరులు, అధికారులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
 
లాక్ డౌన్ 2.0 నేటితో ముగియనుండగా, తెలంగాణలో మాత్రం 7వ తారీఖు వరకూ అమలులో ఉండనుందన్న సంగతి తెలిసిందే. ఈలోగా, లాక్ డౌన్ మూడో విడతను ప్రకటించిన కేంద్రం, మరో రెండు వారాలు నిబంధనలను పాటించాల్సిందేనని స్పష్టం చేస్తూనే, వైన్స్ షాపులను ఓపెన్ చేసేందుకు అంగీకరించింది. 
 
ఇంతవరకూ నిత్యావసరాల డెలివరీకి మాత్రమే అనుమతి ఉన్న ఈ-కామర్స్ సంస్థలు అన్ని రకాల వస్తువులను డెలివరీ చేసేందుకు కూడా అనుమతులు లభించాయి. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకూ పలువురు మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులకు ఫోన్ చేసిన కేసీఆర్, లాక్ డౌన్ సడలింపులు, తదుపరి పర్యవసానాలపై చర్చించారు. ఆదివారం మరికొందరి మనోగతాలను తెలుసుకుని, ఆపై నిఘా వర్గాల నుంచి అభిప్రాయాలను స్వీకరించి, మద్యం షాపులపై ప్రభుత్వ నిర్ణయాన్ని వెలువరిస్తారని తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు