మే31 వరకు లాక్ డౌన్‌ 4.0 పొడిగింపు.. రైలు, విమాన, మెట్రో సర్వీసులు బంద్

సోమవారం, 18 మే 2020 (10:17 IST)
మే 31వ తేదీ వరకు లాక్ డౌన్‌ను కేంద్రం పొడిగించింది. ఏప్రిల్ 17వ తేదీతో లాక్ డౌన్ గడుపు పూర్తయిన తరుణంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌‌డీఎంఏ) పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ 4.0 మార్గదర్శకాలను హోంశాఖ విడుదల చేసింది. రైలు, విమాన, మెట్రో సర్వీసులపై మే 31 వరకు నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. 
 
అదే సమయంలో కంటైన్‌మెంట్‌ జోన్ల మినహా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడుపుకొనేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే, రాష్ట్రాల పరస్పర అంగీకారంతో వీటిని నడుపుకోవచ్చని హోంశాఖ స్పష్టం చేసింది. రాత్రి 7గం. నుంచి ఉదయం 7గం. వరకూ కర్ఫ్యూ యథావిధిగా కొనసాగుతుంది. అన్ని ప్రాంతాల్లోనూ 144వ సెక్షన్‌ అమలు చేయాలి.
 
అయితే దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు అనుమతి లేదు. దేశీయంగా మెడికల్‌ సేవలు, దేశీయ ఎయిర్‌ అంబులెన్స్‌లు, భద్రతకు సంబంధించినవి, ఎంఏహెచ్‌ అనుమతించిన వాటికి మినహాయింపు ఉంటుంది. మెట్రో రైలు సేవలు, స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు మూసి ఉంటాయి. ఆన్‌లైన్‌.. డిస్టెన్స్‌ లెర్నింగ్‌ ఎప్పటిలాగే కొనసాగుతుంది.
 
కంటైన్మెంట్‌ జోన్లలో అత్యవసర సేవలు మినహా ఇతర ఏ కార్యక్రమాలు నిర్వహించకూడదు. ప్రజలు రోడ్లమీదకు రాకూడదు. కంటైన్మెంట్‌ జోన్లలో ప్రతి ఇంటిపైనా నిఘా ఉంటుంది. అవసరమైన వైద్య పరీక్షలు, సేవలు అందించాలి. 65 ఏళ్లు పైబడిన వారు, గర్భిణీ స్త్రీలు, 10 ఏళ్లలోపు చిన్న పిల్లలను తప్పనిసరి అయితే తప్ప ఇంటి నుంచి బయటికి రానీయవద్దని కేంద్రం కోరింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు